పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lx

అట్లే పదవ ఆశ్వాసములోని

క. దేశాధీశ్వరుఁ డర్థుల
కాశాపరిపూర్తి సేయ నారాధితయౌ
నాశాపురమున దేవి ని
వేశాంగణసీమ హోమవిధి గావించెన్. (10–23)

అను పద్యమున తృతీయ చరణము నందలి “ఆశాపురమున" అను పాఠమునకు సందర్భము కుదురదు. మూలమునం దీచోట “ఆశాపూరణి” దేవత ప్రస్తావన గలదు. దానినిబట్టి ఆపాఠమును "ఆశాపూరణి దేవి" అని సవరించితిని. అక్కడక్కడ ఉండిన ముద్రణ స్ఖాలిత్యములను దిద్దితిని. ఆటవెలదులకు బదులుగ గీతమని ఉన్నచోట్ల సవరించితిని. ఇందేవైన దొసగులున్నచో విజ్ఞులు తెలిపిన కృతజ్ఞతతో సవరించికొనెదనని సవినయముగ విన్నవించుచున్నాను.

కృతజ్ఞత
ఈ ప్రాచీనకావ్యము శ్రీవెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారన్నట్లు “సహజమైన శైలితో, లలితములగు జాతీయములతో, మనోహరములగు వర్ణనలతో ప్రశస్తి గాంచినది" అనుటలో అభిప్రాయభేదము లేదు. ఇందు సమకాలిక జనజీవనవిశేషములను గోపరాజు ప్రత్యేకముగ వివరించియున్నందున శ్రీమల్లంపల్లి సోమశేఖర శర్మ గారును, శ్రీసురవరం ప్రతాప రెడ్డి గారును బహుధా ప్రశంసించినారు.

నాకీ పరిష్కరణ పీఠికా రచనలలో అనేక గ్రంథములు తోడ్పడినవి. ఆ గ్రంథకర్తలకును, సంస్కృతమూలగ్రంథము నొసగిన మిత్రులు శ్రీ పి. తిరుమలరావు గారికిని ఋణపడియున్నాను. దీనిని పరిష్కరించు నవకాశమును కల్పించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గము వారికిని, కార్యదర్శి శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తిగారికిని కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను.

గడియారం రామకృష్ణ శర్మ


అలంపూరు
దుర్మతి జ్యేష్ఠముj