lviii
ములలోను స్తుతించినారు. గోపరాజు ప్రత్యేక పద్దతి ననుసరించెను. ఇష్టదైవము కలలో వచ్చి కృతినిమ్మని కోరు స్వప్నవృత్తాంతమును, షష్ఠ్యంతములను విడిచి పెట్టెను. కావ్యారంభమున శివుని, కేశవుని వేరువేరుగను, అవతారికలో ఏకరూపునిగ, ఆశ్వాసారంభములలోను, ప్రతిబొమ్మకథ మొదటను హరినో హరునో వేరుగను, ఆశ్వాసాంతములలో ఒక పద్యము హరికి, ఒకటి హరునకు, ఒకటి ఏకరూపునకును, కావ్యాంతమున ఫలశ్రుతిలో ఏకరూపునిగను స్తుతించినాడు.
గోపరాజునకు తిక్కనాదులపైగల గౌరవముతోడనే గాక మూలము ననుసరించి గూడ హరిహరులను స్తుతించినట్లు కనబడుచున్నది. మూలము నందలి ప్రథమోపాఖ్యానమున భర్తృహరికి దివ్యఫలమియ్యవచ్చిన బ్రాహ్మణుడు హరిహరస్తవముతో ఆశీర్వదించును.
"అహీనమాలికాం భిభ్రత్ తథా పీతాంబరం వపుః
హరో హరిశ్చ భూపాల కరోతు తవ మంగళం॥
హరుని పరముగ - అహి ఇనమాలికాం= పాములకు ప్రభువైన ఆదిశేషుడు అను దండను, తథాపి = అయినను, ఇతాంబరం=వస్త్రము లేని (దిగంబరమైన) వపు = శరీరమును, బిభ్రత్ = వహించునట్టిహరః = శివుడు.
హరి పరముగ - అహీన = వాడని, మాలికాం= దండను (వనమాలను) తథా - అట్లే పీతాంబరం = పచ్చనివస్త్రముగల, వపుః = శరీరమును , బిభ్రత్ = వహించునట్టి, హరిశ్చ = కేశవుడును, నీకు మంగళములు ఇత్తురుగాక.
ఈ శ్లోకమునే గోపరాజు అవతారికలోని సీసపద్యముగా విపులీకరించెను. ఇదే ఉపాఖ్యానములో ఒక దిగంబరుడు విక్రమార్కునిట్లు దీవించును
"లీలయా మండలీకృత్య, భుజంగాన్ ధారయన్ హరః
దద్యాద్దేవో వరాహశ్చ, తుభ్య మభ్యధికాం శ్రియం"