పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

345


ఆ.

ధరణిలోనఁ బాముతలగాము లుండునం
ద్రిట్టిపాములు మెయిఁ జుట్టుకొనఁగ
నీవు శంక లేక నేనున్న చోటికి
వచ్చినాఁడ వెద్ది వాంఛితంబు.

106


క.

వినిపింపుము సురలకునై
నను బడయఁగరాని ప్రార్థనలు నీ కిత్తున్
ఘనుఁ డని చేరినచోఁ గై
కొని యతనికి నొక్కమేలు గూర్పం దగదే.

107


మ.

అనిన న్సంతసమంది సాంజలిపుటుండై విక్రమాదిత్యుఁ డి
ట్లనియె న్సిద్ధయతీంద్ర విష్ణుక్రియ నిత్యానందవారాశిఁ జొ
క్కినచిత్తంబున నాత్మయోగవశముక్తి శ్రీసమేతుండ వై
యనువేలంబుగఁ దేలియాడు నిను డాయంగంటి నేఁ జాలదే.

108


క.

నినుఁ జూచినయవి కన్నులు
నినుఁ బొగడినయదియ జిహ్వ నీగుణగణము
ల్వినినయవి చెవులు నీకుం
బనిచేసినయవియ పాణిపద్మము లనఘా.

109


శా.

నిత్యానందపదప్రతీతచరితా! నీదర్శనం బైనచో
బత్యక్షంబుగ మేననున్న ఫణభృద్బృందంబు లి ట్లూడె న
ప్రత్యక్షంబుగ గర్మబంధములు నిభంగి న్వెసం బాసె నా
దిత్యోగ్రద్యుతి పర్వినం దిమిరమున్ దిగ్భూముల న్నిల్చునే.

110


చ.

కమలవనైకమిత్రుని ప్రకాశ మొకించుక పర్వి సూర్యకాం
తమునకు దీప్తు లిచ్చినవిధంబున నీకరుణార్ద్రదృష్టి సం
యమివర నాపయిం బొలసినంతనె పాపమువాసి యెల్ల పు
ణ్యములును గల్లె వేఱె నినుఁ బ్రార్థన చేయఁగ నేల నాకిఁకన్.

111