పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

సింహాసన ద్వాత్రింశిక


వ.

అట్లు దిరుగక యురగభూషణుండునుంబోలె మృత్యువుకడ నిశ్శంకుండై ముందఱఁ జని.

101


సీ.

పులితోలు కచ్చడంబుగ మొలఁ గాసించి
        సర్వాంగములను భస్మంబు పూసి
శిరమునఁ గెంజెడ వెరవార బిగియించి
        విమలాక్షమాల హస్తమునఁ దాల్చి
యాసనశక్తికి నాధార మగుయోగ
        దండంబు పైఁ బాణితలము సేర్చి
పట్టు గల్గిన యోగపట్టె పూనిన మేను
        స్వస్తికాసనమునఁ జక్కనిలిపి


ఆ.

కంధరము వంచి నాసికాగ్రమున దృష్టి
గదియఁ గదలక ముక్కన్ను గానరాని
శూలిపోలిక నున్న త్రికాలనాథుఁ
జూచి సాష్టాంగ మెరఁగె నాక్షోణివరుఁడు.

102


వ.

ఇట్లు సాష్టాంగ దండంబు గావించిన.

103


క.

అప్పరమయోగి యోగం
బప్పుడు వారించి లేచి యాతనిఁ గరుణం
దప్పక చూచిన మేను
గప్పినసర్పములు విడిచి కనుకనిఁబఱచెన్.

104


శా.

దృష్టిం బాములఁ ద్రోలి యాతఁడు ధరిత్రీనాథు మన్నించి సం
తుష్టుండై పలికెన్ జనోత్తమ జగద్ధుర్వారదర్వీకరా
శ్లిష్టప్రాంతరమౌ మహాటవి మది న్లెక్కింప కీమంచులో
నిష్టోద్యోగము పూని వచ్చితివి నీయీ డెవ్వరిం జెప్పుదున్.

105