పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iii


వీరఘోట్ట విభాళు డారూఢ బిరుద వి
      రోధి కళింగనిరోధి యనఁగ,
వెలసి నానాఁటికి వెలనాఁటి పృథ్వీశ్వ
      రుని రాజ్యభార ధుర్యుండనంగ,
ఆరెలు కన్నడీ లఱవలు తెలుఁగులు
      దనబిరు దందియఁ దగిలి కొలువ,

నెగడి సనదప్రోలు నెలవుగా భూసుర
వంశసాగరామృతాంశమూర్తి
చక్రవర్తిమాన్య సౌజన్యధన్యుండు
విక్రమార్కనిభుడు వెన్నవిభుడు”.       (1-42)

ఆ వెన్నయ పౌత్రుడు 'అమరేశ్వరుడు'. కొడుకును చెప్పక మనుమని చెప్పినందున అమరేశ్వరుడు సాక్షాత్ పౌత్రుడు కాడనియు ఆ వంశమున పుట్టిన వాడనియు గ్రహింపవలెను. అమరేశ్వరునకు గంగాంబిక యందు “అన్నయ-సింగయ' అను పుత్రులు పుట్టిరి. అన్నయను గూర్చి గోపరాజేమియు చెప్పలేదు. కాని 'ముప్పది యిద్దరు మంత్రుల చరిత్ర'లో అన్నయు దానకర్ణుడని చెప్పబడినది.

“ఘనదాన కర్ణుడై గండ పెండెముఁ దాల్చెఁ
      గొరవి అన్నామాత్యకుంజరుండు"

ఈ ఆన్నయ కొడుకు పెద్దిరాజు, పల్లికొండరాజు మల్లదేవరాజుచే ఆందోళికాచ్ఛత్రచామరములు బహూకృతులుగా పొందెను (1-46). ఈ పల్లి కొండరాజ్యమెటనున్నదో తెలియదు. అన్నయతమ్ముడు సింగయకు అబ్బయ, గోపయ, సత్తెనారన అను ముగ్గురు కొడుకులు పుట్టిరి. అబ్బయకు రామరాజు, కేశరాజు, బాచిరాజు, సింగరాజు అను నలువురు పుత్రులు. వీరిలో బాచన-సింగనలు రాచకొండ నేలిన అనపోత కుమార సింగయకు మంత్రులై యుండిరి,