పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

321


క.

నీవును నేనును నొక్కటి
గావున నాకుండలములు గైకొను మివి సం
భావనతో నిత్యమును మ
హీవర సౌవర్ణభార మిచ్చుచునుండున్.

140


ఆ.

ఎన్న నాల్గుమాడలె త్తొకకర్షంబు
నాల్గుకర్ష లైన నగుఁ బలంబు
పలము లొక్కనూఱు తుల యగుఁ దుల లొక్క
యిరువది మితి భార మిది మతంబు.

141


క.

అని యిచ్చినఁ గైకొని యా
తనిపదముల కెఱఁగి మగుడుతఱిఁ గంబం బొ
య్యనఁ గ్రుంకఁగఁ దీర్థమునకు
మనుజేంద్రుఁడు చేరవచ్చె మాపటివేళన్.

142


ఆ.

కంబ మచట మునుఁగఁగా గంతుగొని తీర
భూమి నిలిచి తగిన నేమమెల్లఁ
దీర్చి భ క్తితోడ దేవతాలయములో
నుండి రేయి గడపి యొక్కరుండు.

143


శా.

ప్రాతఃకాలమునందు లేచి ధరణిపాలుండు తీర్థంబులో
స్నాతుండై నియమంబుతోడ శివపూజాకృత్యముం దీర్చి సం
ప్రీతిం గ్రమ్మఱి వచ్చుచోఁ దెరువునం బృథ్వీసురుం డొక్కరుం
డేతెంచెం గడుదీనుఁడై యతని నింపేపార దీవించుచున్.

144


క.

చేరఁ జనుదెంచి యతఁ డో
వీరోత్తమ పేదవాఁడ విప్రుఁడ నే నా
హారంబు వేఁడి వచ్చితిఁ
గారుణ్యము మెఱసి యిచటఁ గావుము నన్నున్.

145