xxvii
మ. మహిమాఖండలుఁడంచు భూజనులు సంభావింప నీ వింపుతో
మహిఁ బాలించుచుఁ బుణ్యకృత్యముల ధర్మద్రవ్య మార్జింపఁగా
గ్రహదోషంబులు పుట్ట వట్లయిన నో రాజేంద్ర యీయేఁట దు
స్సహపాపగ్రహసంభవంబగు నతిక్షామంబు వర్తిల్లెడిన్.
ఉ. అక్రమ మాచరించి విను మర్కతనూజుఁడు తొల్లియున్న యా
శుక్రుని రాశిఁ దా విడుచుచున్ శకటాకృతి నున్న రోహిణీ
చక్రము దూఱి మంగళుని సద్మముఁ జేరఁగడంగి యేఁటిలో
వక్రగతిం జరింపగ నవర్షణమై చనుఁ గొన్ని వర్షముల్.
క. పఱి పఱి నిల పఱియలుగా
నెఱిసిన వనపంక్తులెండ నిరుపమ మగు నా
వఱపునఁ బండ్రెం డేడులు
కఱవిక నతిదుస్తరంబు గాఁగల దధిపా.
చ. అనవుడు దీని కడ్డుపడునట్టి యుపాయము గల్గెనేని నా
యనువెఱిఁగింపు మన్న వసుధామర తృప్తియె కారణంబుగా
నొనరిన దేవతార్చనల హోమములన్ గ్రహపూజ మున్నుగా
జనవర! శక్తికిం దగిన శాంతి యొనర్పుము వర్షణంబగున్.
క. ఇనుమున నాశనిరూపం
బొనరించి వినీల వస్త్ర యుక్తంబుగ న
ర్చనము రచియించి ఖదిరేం
ధనమున హోమంబు సేయఁ దత్ప్రీతి యగున్.
చ. అనిన ద్రివిక్రముండు మొదలైన పురోహితులన్ గ్రహాది పూ
జనములు సేయఁబంచి మృదుశాలిమయాన్నముఁ బాయసంబులున్
మునుముగఁ బిండివంటలు సమూహముగా నొనగూర్చి యిష్టభో
జనముల భూసురుల్ దనియ శాంతి దలంబుగఁ జేసి శక్తితోన్.