పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202 సింహాసన ద్వాత్రింశిక

గావనక యెద్దిపంచినఁ
గావించెద నుడిగమునకుఁ గైకొను నన్నున్. 279

గీ. అనుడు వసుమతివల్లభుం డల్ల నవ్వి
యెద్దిపంచినఁ గావింపనియ్యకొంటి
వనజలోచన జాతిఁ బద్మినివి నీవు
సరసగంధరుని గమలాకరు భజింపు. 280

క. ఓకమలాకర మును నీ
వీకమలాసన భజింప నింపొందితి నేఁ
డీకాంతామణిఁ గైకొని
యేకాంతక్రీడ నిలువు మిచ్చట సుఖివై. 281

వ. అని పరస్పరకరగ్రహణంబు చేయించి. 283

ఆ. లంకలోని రాజ్యలక్ష్మి విభీషణు
కిచ్చి వచ్చు రాఘవేంద్రు పగిది
దితిజుఁ జంపి వారసతి నాశ్రితున కిచ్చి
విజయలక్ష్మిఁ గూడి విభుఁడు గదలి. 284

క. వాలుంగంటి నిలువు మని
వాలాయింపంగ నేఁగవలయు ననుచు న
వ్వాలుమగఁడు మెఱుఁగారెడు
వాలు సహాయముగ మగిడి వచ్చెం బురికిన్. 284

క. కావున నీకీగుణములు
లేవైనను గద్దె నెక్క లే విట మగుడం
బోవుట మే లనవుడు భో"
జావనిపతి సిగ్గుపడుచు నల్లనఁ దిరిగెన్. 285