పుట:సత్యశోధన.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

316

యుద్ధరంగంలో

38. యుద్ధరంగంలో

ఇంగ్లాండు చేరిన తరువాత గోఖలేగారు పారిస్‌లో చిక్కుకు పోయారని తెలిసింది. పారిసుతో రాకపోకలు ఆగిపోయాయి. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఆరోగ్యం కోసం గోఖలేగారు ఫ్రాన్సు వెళ్ళారు. యుద్ధం కారణంగా వారు అక్కడ చిక్కుబడిపోయారు. వారిని కలవకుండా దేశం వెళ్ళడం సాధ్యం కాని పని. అయితే ఆయన ఎప్పుడు రాగలిగేది చెప్పగల వారెవ్వరూ లేరు.

ఈ లోపున నేను ఏం చేయాలి? యుద్ధంలో నా పాత్ర ఏమిటి? దక్షిణ ఆఫ్రికా జైల్లో నా అనుచరుడు, సత్యాగ్రహి అయిన సోరాబ్‌జీ ఆడాజనియా ఇంగ్లాండులో బారిష్టరీ చదువుతూ వున్నాడు. ఉత్తమోత్తమ సత్యాగ్రహిగా ఆయనను బారెట్లా చదవమని అక్కడి వాళ్ళు పంపించారు. ఆయన నా స్థానాన్ని భర్తీ చేస్తారన్నమాట. ఆయన ఖర్చు దాక్టర్ ప్రాణ జీవరాజ్ మెహతా గారు భరిస్తున్నారు. నేను వారిని సంప్రదించాను. ఇంగ్లాండులో నివసిస్తున్న హిందూ దేశస్థుల సమావేశం ఏర్పాటు చేయించి వారికి నా అభిప్రాయాలు తెలియజేశాను. ఇంగ్లాండులో నివసిస్తున్న హిందూ దేశస్థులంతా యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరించాలని నాకు తోచింది. ఆంగ్ల విద్యార్థులు యుద్ధంలో పాల్గొని సేవ చేస్తామని ప్రకటించారు. హిందూ దేశస్థులు ఎందుకు వెనకబడాలి. ఈ అభిప్రాయానికి వ్యతిరేకంగా చాలా కారణాలు పేర్కొనబడ్డాయి. మనకు ఆంగ్లేయులకు మధ్య ఎంతో తేడా వున్నదని, ఒకరు బానిసలైతే మరొకరు ప్రభువులని, అట్టిస్థితిలో బానిసలు ప్రభువుకు ఆపదసమయంలో స్వేచ్ఛగా ఎలా సాయం చేయగలరని కొందరు ప్రశ్నించారు. బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావిస్తున్న బానిస యజమాని ఆపదల్లో చిక్కుకున్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పేమిటి అని కూడా అన్నారు. ఈ తర్కం అప్పుడు నాకు మింగుడు పడలేదు. మనం పూర్తిగా బానిసత్వంలో లేమనే అభిప్రాయంతో అప్పుడు నేను వున్నాను. అసలు ఆంగ్ల ప్రభుత్వ విధానంలో లేదని, దాన్ని అమలుపరుస్తున్న ఆంగ్ల అధికారుల్లో దోషం అధికంగా వున్నదని ప్రేమద్వారా ఆదోషాన్ని తొలగించుకోవచ్చని భావించాను. ఆంగ్లేయుల సాయంతో మనస్థితిని చక్క దిద్దుకోవాలని మనం భావిస్తూ వుంటే ఆపద సమయంలో వారికి సాయం చేసి తద్వారా పరిస్థితి చక్కదిద్దుకోవాలని అభిప్రాయపడ్డాను. రాజ్యవిధానం దోషమయంగా వున్నప్పటికీ ఆ రోజుల్లో అది యిప్పటివలెనే నాకు పెద్దదిగా కనబడలేదు. అయితే ఇప్పుడు ఆంగ్ల