పుట:సత్యశోధన.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

315

అన్నాడు. “నేను పారేయనా?” అని అడిగాను. ‘పారేయండి’ అని అన్నారు. నేను దుర్భిణీ యంత్రాన్ని సముద్రంలో విసిరి వేశాను. దాని ఖరీదు సుమారు ఏడు పౌండ్లు, అయితే దాని విలువ దాని ఖరీదులో లేదు. దాని యెడ కేలన్‌బెక్‌కుగల వ్యామోహంలో వుంది. అయినా కేలన్‌బెక్‌కు ఎన్నడూ దుఃఖం కలగలేదు. ఆయనకు నాకు మధ్య యిలాంటి వ్యవహారాలు చాలా జరుగుతూ వుండేవి. వాటిలో యిది ఒకటి. నమూనాగా పాఠకులకు యీ విషయం తెలియజేశాను.

పరస్పర సంబంధాల వల్ల ప్రతిరోజు ఏదో క్రొత్త విషయం నేర్చుకొనేవారం. ఇద్దరం సత్యాన్వేషణకు కృషిచేస్తున్నాం. సత్యాన్ని పాటించడం వల్ల క్రోధం, స్వార్ధం, ద్వేషం మొదలుగాగలవి సహజంగా తగ్గిపోయాయి. అవి తగ్గకపోతే సత్యం గోచరించదు. రాగద్వేషాలతో నిండియున్న మనిషి, సరళ హృదయుడు. అయినప్పటికీ సత్యవాక్కులే పలుకుతూ వున్నప్పటికీ శుద్ధసత్యాన్ని దర్శించలేడు. శుద్ధమైన సత్యశోధన జరపడమంటే రాగద్వేషాదుల నుండి విముక్తి పొందడమే. యాత్రకు బయలుదేరినప్పుడు నేను చేసిన ఉపవాసం ముగిసి ఎన్నోరోజులు దాటలేదు. అందువల్ల నాకు పూర్తి శక్తి చేకూరలేదు. రోజూ డెక్ మీద పచార్లు చేసి ఆకలి పెంచుకోవడానికి, ఎక్కువ ఆహారం తీసుకోవడానికి, తిన్న ఆహారం జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేయసాగాను. ఇంతలో నా పిక్కల్లో నొప్పి ప్రారంభమైంది. ఇంగ్లాండు చేరిన తరువాత కూడా నొప్పి తగ్గలేదు. యింకా పెరిగింది. ఇంగ్లాండులో డాక్టర్ జీవరాజ్ మెహతాతో పరిచయం కలిగింది. ఉపవాసాన్ని, పిక్కలనొప్పిని గురించి వివరించి చెప్పాను. అంతా విని “మీరు కొద్ది రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకొనలేకపోతే కాళ్ళు పనిచేయలేని స్థితి ఏర్పడవచ్చు” అని ఆయన చెప్పాడు. ఉపవాసాలు చేసిన వ్యక్తి పోయిన శక్తిని త్వరగా పొందాలనే కోరికతో ఎక్కువ ఆహారం భుజించకూడదను విషయం అప్పుడు నాకు బోధపడింది. ఉపవాసం విరమించినప్పుడు ఎంతో జాగ్రత్తగా వుండి, సంయమం అలవర్చుకోవలసి వుంటుంది. మదిరా స్థావరం చేరినప్పుడు మహాయుద్ధం కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నదని మాకు సమాచారం అందింది. మమ్మల్ని అక్కడ ఆపి వేశారు. పలుచోట్ల సముద్రంలో మందు పాతరలు పాతి పెట్టారని తెలిసింది. వాటిని తప్పించుకొని సౌదెంప్టన్ చేరడానికి రెండు రోజులు పట్టింది. ఆగష్టు నాల్గవ తేదీన యుద్ధ ప్రకటన వెలువడింది. ఆరవ తేదీన మేము ఇంగ్లాండుకు చేరాము.