208
కాంగ్రెసులో
15. కాంగ్రెసులో
మహాసభ ప్రారంభమైంది. ఆ మంటపం యొక్క భవ్యత, ఆ వాలంటీర్ల విధానం, వేదిక మీద ఆసీనులైన ఆ పెద్దల సముదాయం చూచి నివ్వెరబోయాను. యీ సభలో నాకు చోటు ఎక్కడ అని తికమకపడ్డాను. అధ్యక్షుని ఉపన్యాసం ఒక బృహత్ గ్రంథం. దాని నంతటిని చదవడం అసంభవం. అందువల్ల కొన్ని కొన్ని అంశాలే చదువబడ్డాయి.
తరువాత విషయనిర్ణయ సభకు ఎన్నికలు జరిగాయి. గోఖ్లే గారు నన్ను అక్కడికి తీసుకువెళ్లారు.
సర్ ఫిరోజ్షా గారు నా తీర్మానాన్ని అంగీకరిస్తామని యిదివరకే చెప్పారు. కాని వారు ఎప్పుడు దీన్ని ప్రతిపాదిస్తారో అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ప్రతి తీర్మానం మీద సుదీర్ఘ ఉపన్యాసాలు సాగుతూ వున్నాయి. అవన్నీ ఇంగ్లీషులోనే తీర్మానాల్ని సమర్ధించే వారంతా ఉద్దండులే. ఈ నగారాఖానాలో నా తూతూ వినేవారెవ్వరు? రాత్రి ప్రొద్దు పోతున్నది. నా గుండె దడదడ లాగసాగింది. చివరికి మిగిలిన తీర్మానాలన్నీ వాయు వేగంతో పరుగెత్తసాగాయి. అందరూ ఇంటికి పోవాలని తొందరపడుతున్నారు.
రాత్రి పదకొండు దాటింది. నాకు మాట్లాడదామంటే సాహసం చాలడం లేదు. గోఖ్లేగారికి గతంలోనే తీర్మానం చూపించాను. వారి కుర్చీదగ్గరికి వెళ్లి మెల్లిగా “నా మాట మరిచి పోవద్దు” అని అన్నాను. “నాకు గుర్తున్నది. వాళ్ల వేగం చూస్తున్నారు కదా! ఏది ఏమైనా సరే తప్పి పోనీయను” అని వారు సమాధానం యిచ్చారు.
“ఏం, అంతా ముగిసింది కదూ!” అని ఫిరోజ్షాగారి ప్రశ్న.
“ఇంకా దక్షిణ ఆఫ్రికాను గురించిన తీర్మానం మిగిలివుంది. గాంధీగారు చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నారు.” అని గోఖ్లే గారు బిగ్గరగా చెప్పారు. “మీరు ఆ తీర్మానం చూచారా?” అని ఫిరోజ్షాగారు అడిగారు.
“చూచాను”
“మీకు బాగుందా?”
“ఆ, బాగుంది”
“అయితే గాంధీ! చదువు”
నేను వణుకుతు తీర్మానం చదివి వినిపించాను. గోఖ్లేగారు నా తీర్మానాన్ని సమర్ధించారు.