పుట:సత్యశోధన.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

వర్ణద్వేషం


18. వర్ణద్వేషం

కోర్టు ఒక త్రాసు వంటిది. ఈ త్రాసును సమానంగా ఒక వృద్ధ వనిత పట్టుకుంటుంది. ఆమెకు పక్షపాతం ఉండదు. ఆమె గ్రుడ్డిది కూడా. ఆమెది కుశాగ్రబుద్ధి. బ్రహ్మ ఆమెను గ్రుడ్డిదాన్నిగా చేసినందువల్ల ముఖం చూచి ఆమె ఎవ్వరికీ బొట్టు పెట్టదు. యోగ్యతను బట్టి మాత్రమే బొట్టు పెడుతుంది. కాని నేటాలు నందలి వకీళ్ల సభ అందుకు విరుద్ధంగా ముఖం చూచి బొట్టు పెట్టమని సుప్రీంకోర్టును ఉసి కొల్పింది. కాని కోర్టు మాత్రం ఈ సందర్భంలో తన త్రాసుకు సరిపోవు పనే చేసింది.

సుప్రీం కోర్టులో అడ్వకేటుగా చేరేందుకై అర్జీ పంపాను. బొంబాయి హైకోర్టు వారి అనుజ్ఞా పత్రం నా దగ్గర వున్నది. నేను బొంబాయి హైకోర్టులో ప్రవేశించినప్పుడు నా ఇంగ్లీషు సర్టిఫికెట్టు మూలప్రతి దాఖలు చేయవలసి వచ్చింది. నేటాలు సుప్రీంకోర్టులో ప్రవేశానికి యోగ్యతకు సంబంధించిన రెండు ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలి. తెల్లవారి ప్రమాణ పత్రాలకు ఎక్కువ విలువ వుంటుందని భావించాను. అబ్దుల్లా సేఠ్‌గారి ద్వారా పరిచితులు, ప్రసిద్ధులు అయిన ఇద్దరు తెల్లవారి దగ్గర ప్రమాణ పత్రాలు తీసుకొని అర్జీ దాఖలు చేశాను. ఒక వకీలు ద్వారా అర్జీ దాఖలు చేయడం కోర్టు విధి. సామాన్యంగా యీ అర్జీలను అటార్నీ జనరల్ ఫీజు పుచ్చుకోకుండానే దాఖలు చేసుకోవడం పరిపాటి. అబ్దుల్లా సేఠ్‌గారి కంపెనీకి సలహాలిచ్చే ఎస్కాంబిగారే అటార్నీ జనరల్. నేను వారి దర్శనం చేసుకున్నాను. ఆయన సంతోషంతో నా దరఖాస్తును మంజూరుచేశారు.

ఇంతలో హఠాత్తుగా వకీళ్ల సభవారు నాకు నోటీసు పంపారు. నా దరఖాస్తుతో బాటు ఇంగ్లీషు సర్టిఫికెట్ మూలప్రతి జత పరచకపోవడం లోపమని వ్రాశారు. అడ్వకేట్లను చేర్చుకొనుటకు నియమావళి తయారుచేసినప్పుడు నల్లవారిని చేర్చుకోవచ్చునా చేర్చుకోకూడదా అని వారు విచారించలేదు. ఇదే వారి వ్యతిరేకతకు ప్రధాన కారణం. నేటాలు దేశపు అభివృద్ధికి తెల్లవారే ముఖ్య కారణం. అందువల్ల వకీళ్లలో తెల్లవారి ఆధిక్యతను సంరక్షించడం తన కర్తవ్యమని వారు భావించారు. నల్లవాళ్లను చేర్చుకుంటే వారి సంఖ్య పెరిగిపోయి తెల్లవారి సంఖ్య తగ్గిపోతుందని, తెల్లవారి ఆధిక్యత తగ్గిపోతుందని వారి తపన.

నా అర్జీ మంజూరు కాకుండా చూచేందుకై వాళ్లు ఒక ప్రసిద్ధుడైన వకీలును నియమించారు. అతనికి అబ్దుల్లా సేఠ్‌గారి కంపెనీతో సంబంధం వుంది. అందువల్ల