పుట:సత్యశోధన.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

అక్కడే ఉన్నాను


17. అక్కడే ఉన్నాను

1893వ సంవత్సరంలో హాజీ మహమ్మద్ సేఠ్ నేటాల్ రాష్ట్రంలో నివసించే భారతీయులలో ప్రముఖుడుగా భావించబడి వారికి నాయకుడుగా ఎన్నుకోబడ్డాడు. సంపదలో హాజీ మహమ్మద్ సేఠ్‌గారికే అంతా ప్రథమ స్థానం యిస్తూ ఉండేవారు. అందువల్ల వారి ఆధిపత్యాన ఒక సభ అబ్దుల్లా సేఠ్‌గారి ఇంట్లో ఏర్పాటుచేశారు. ఆ సభలో ఫ్రాంచైజు బిల్లును ప్రతిఘటించాలని తీర్మానం చేయబడింది .

స్వచ్ఛంద సేవకుల దళం ఏర్పాటు చేయబడింది. నేటాలులో పుట్టి పెరిగిన భారతీయులు, భారతీయులగు క్రైస్తవులలో పిన్నవారినందరినీ యీ సభకు ఆహ్వానించారు. దర్బను కోర్టులో దుబాసీగా వున్న పాల్‌గారు, మిషన్ హైస్కూలు హెడ్‌మాష్టరు సుభాన్ గాడ్‌ఫ్రేగారు కూడా వచ్చి ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభకు భారతీయ క్రైస్తవులు ఎక్కువగా వచ్చి పాల్గొనుటకు వీరే కారకులు అయ్యారు. వారంతా స్వచ్ఛంద సేవకుల దళంలో చేరారు.

ఆ చుట్టుప్రక్కల గల వర్తకులలో చాలామంది స్వచ్ఛంద సేవకుల బృందంలో చేరారు. అట్టివారు చిరస్మరణీయులు. దావూద్ ముహమ్మద్, మహమ్మద్ కాసిం, కమర్‌ఉద్దీన్, ఆదంజీమియాఖాన్, ఏ.కొలందవేలు పెళ్ళై, సి.లచ్చీరాం, రంగస్వామి, పడియాచి, ఆమోదజీవ మొదలుగువారు వారిలో ముఖ్యులు. పార్సీ రుస్తుంజీ వుండనే వున్నారు. జోషీ, సరసీరాం మరియు దాదా అబ్దుల్లా కంపెనీ మొదలగు కంపెనీల గుమాస్తాలు స్వయం సేవకులుగా చేరారు. అందరికీ ఉపయోగపడే యిట్టి కార్యక్రమం వారికి క్రొత్త అందువల్ల అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈ విధంగా సభకు ఆహ్వానింపబడటం, సభలో అంతా వచ్చి పాల్గొనడం, వారికి నూతనానుభవం. ఈ మహావిపత్తులో పెద్దలు, పిన్నలు, ధనికులు, పేదలు, సేవ్యులు, సేవకులు, హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, పారశీకులు, గుజరాతీలు, మద్రాసీలు, సింధీలు మొదలుగాగల భేదాలు, తరతమ భేదాలు అన్నీ తొలగిపోయాయి. అందరూ భారత దేశ బిడ్డలే. అందరూ సేవకులే. బిల్లు రెండవసారి ప్యాసు అయిందోలేదో మరి కాబోతున్నదో కూడా భారతీయులు తెలుసుకోవడం లేదనీ, యిందువల్ల భారతీయులు వోటుహక్కు అక్కర్లేదని తామే ప్రకటించుకుంటున్నారనీ నేటాలు అధికారులు ప్రసంగాలు చేయడం ప్రారంభించారు.

నేను సభలో యీ విషయం చెప్పాను. వెంటనే బిల్లు చర్చ ఆపవలసిందని అసెంబ్లీ ప్రెసిడెంటుకు తంతి పంపించాము. ప్రధానమంత్రి సర్ జాన్ రాబిన్సన్ గారికి