పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xvii

5.ఈ కవియొక్క లాక్షణికత

శ్రీ పూండ్లవారి వ్రాత—“ఇక్కవి గొప్పలాక్షణికుఁడు, తాను నేర్చిన లక్షణముల కన్నింటికి లక్ష్యముల నీ గ్రంథమునం దుదాహరించియున్నాఁడు. ఆంధ్రభాషలో లక్ష్యలక్షణములను దెలుపు గ్రంథము లొండురెండుగాని విశేషములు లేవు. అవి యనఁగా కావ్యాలంకార చూడామణియు, నరస భూపాలీయము అనునవి. ఇందు మొదటి గ్రంథమును విశ్వేశ్వరుఁడను ప్రభువు పై విన్నకోట పెద్దనయను మహాకవి యంకితం బిచ్చియున్నాడు. ఇది బహు పురాతన గ్రంథము. ఇయ్యది పోతన శ్రీనాథుల కాలమునకు శ్రీకృష్ణరాయల వారి కాలమునకుఁ బూర్వమువ్రాయఁబడినది[1]. ఇందు వ్యాకరణ విషయము, అలంకార విషయము, ఛందశ్శాస్త్రవిషయము, కావ్యలక్షణము, నాయకనాయికాది గుణములు, బంధకవిత్వ గర్భకవిత్వ చిత్రకవిత్వాది విషయములు వ్రాయఁబడి యున్నవి. ఇఁక రెండవ గ్రంథము నరసభూపాలీయము. ఇప్పుడు ముద్రితమై యున్నదిగాన దీనిని గుఱించి మేము విశేషముగ వ్రాయఁ బనిలేదు. ఈ రెండు లక్షణ గ్రంథములును నరాంకితము లగుటచే నిక్కవి తానొక లక్షణగ్రంథమును వ్రాయఁ దల పెట్టియు నిదివఱకే యిద్దఱు లాక్షణికులు లక్ష్యలక్షణములు వ్రాసి యున్న లక్ష్యములగు పద్దియములు నర స్తుతులు యెంచి వానిని నోరగ్రుచ్చ మనసురాక తాను మరలఁ గొత్త లక్ష్యములగు పద్యములను మాత్రము వ్రాసి వానిని శ్రీ వేంకటేశ్వర స్వామికి నంకితంబిచ్చి యీగ్రంథమును వ్రాసి యున్నాడు. ఇది కవి యభిప్రాయము గానినాఁడు తాఁ దిరుగ లక్షణమును గ్రంథమునందు వ్రాసియే యుండును. కాఁబట్టి యీగ్రంథమందుండు లక్ష్యములగు పద్యముల కన్నిటికి లక్షణమిదియని కవియే వాసియున్నాఁడుగాని, యా లక్షణములను వివరించియుండ లేదు. కావున మఱియొక గ్రంథమునుండి లక్షణములను దెలిసికొని యిందలి లక్ష్యములను గ్రహించ వలయును."

  1. ఇది చరిత్ర తెలియని ఆనాటి వారి యభిప్రాయము. విన్నకోట పెద్దన శ్రీనాథునికి సమకాలికుఁడుగా నుండి క్రీ శ. 1402లో చిత్రభాను దీనిని వ్రాసినట్లు చరిత్రకారుని నిర్ణయము. ఈతఁడు విశాఖపట్టణ మండలమువాఁడు. విశ్వేశ్వరుఁడు, అక్కడి యొక చాళుక్య శాఖకు చెందిన రాజు. ఈ కవియే 'అల విన్నకోట పెద్దన' అను పద్యములో పెద్దనను నన్నయకు ముందు పెట్టుటయే ఈ భ్రమకు కారణముగా నుండును. చూ. నా కావ్యాలంకార చూడామణ్యుపోద్ఘాతము.