పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వ.

అయిన నొక్కవిశేషంబు గల దది యెట్లన్న నయోధ్యాధి
పతియగు దశరథుడు పుత్రార్థి యై స్వామిపుష్కరిణీ
తటంబునఁ దపంబు సేయువాఁడు ఆరాజేంద్రునకు హరి
ప్రత్యక్షం బగు వాఁడు. మన మెల్ల నచ్చట నిలిచి యుండి
ప్రత్యక్ష మగు హరికి మ్రొక్కులిడి ప్రార్థింత మని యా
యజుండు దేవతలం దోడ్కొని వేంకటాద్రికి నుత్తరభాగం
బునఁ దిరుగుచుండ నద్భుతంబగు నొకపర్వతంబు నందు.

28


సీ.

సంతానమందారచంపకవకుళవి
        ఖ్యాతద్రుపరివృత మైనదాని
దిక్కులను స్వాదు పిక్కటిల్లఁగఁ జేయు
        ఫలపుష్పవితతిచేఁ బ్రబలుదాని
శుకపికప్రముఖపక్షులు వినోదంబుగా
        నుప్పొంగి పల్కఁగా నొప్పుదాని
ఘనగండభేరుండకంఠీరవాది మ
        హామృగధ్వనులు మిన్నందుదాని


తే.

గరుడ గంధర్వ యక్ష కిన్నరగణంబు
లెలమిఁ దిరిగెడు సానువు లలరుదాని
నదులు కమలాకరములు నానాముఖముల
నతిశయింపఁగ విస్తీర్ణ మైన గిరిని.

29

బ్రహ్మేంద్రాదులు వేంకటాద్రికి వచ్చుట

చ.

కనుఁగొని బ్రహ్మముఖ్యు లతికౌతుక మొప్పఁగ నాగిరీంద్రమం
దనువుగఁ జేరి భక్తి యెసలారఁగఁ దీర్థములందుఁగ్రుంకుచున్
వనఫలపుష్పముల్గొనుచు వారిజనాభుని పూజ సేయుచున్
వినమితభక్తి నచ్యుతుని వేచిరి యాతనిరాకకందఱున్.

30