పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వ.

అంత నాదశాస్యుని జంపి వేదవతియనుసీత నగ్నిం బ్రవేశించె
నంత వేదవతి పద్మంబుననుండి యాకాశరాజేంద్రునికి
లభించె, నే నద్దానిం గని మరులెసంగి తల్లడంబడువాఁడ
నయ్యది నను మఱచివోయె నంత.

338


మ.

అని యమ్మాధవుఁ డాప్తతం దనదువృత్తాంతంబు పద్మావతీ
జననంబు న్వినుపింపఁగా వకుళ శ్రీస్వామి న్విలోకించి యి
ట్లనె నోదేవ మహానుభావ మును నే నజ్ఞాననై మానవుం
డని బాలుండని యుండి తేను నిను బ్రహ్మం బంచు సేవించెదన్.

339


శా.

నీవే బ్రహ్మను గన్నతండ్రిని మహానిర్వాణసంధాత వీ
వే విష్ణుండవు రామచంద్రుఁడవు నీవే కృష్ణదేవుండు వీ
వే వేదాత్మవు సర్వతోముఖుఁడ వీవే కర్త వాభోక్త వీ
వే విశ్వంబు వరాహదేవుఁడవు నీవే శేషశైలాధిపా.

340


క.

తోయజలోచన నే నీ
మాయను గనలేక నాకుమారుఁడ వంచున్
నీయందుఁ బ్రేమ ముంచితి
నాయీశుఁడ వంచుఁ దెలియ నైతి మహాత్మా.

341


సీ.

అన విని విష్ణుఁ డిట్లనియె నిచ్చట నీవు
        తలగాయమును మాన్పి తల్లివలెను
బోషింప నీఋణంబును దీర్చు టెట్లుకో
        యని నేను జింతింతు ననుచు వకుళ
మాలికపై విష్ణుమాయఁ దెప్పునఁ గప్పి
        పుత్రవాత్సల్యసద్బుద్ది నిల్పి
మఱల నిట్లనియె నమ్మా వివాహము నాకుఁ
        జేయు మీవంచు మచ్చికలు వల్కి