పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

281


దల్లికి నొసంగి యంతటఁ దాను బోయి
పాన్సుపైఁ జేరె హాయిగఁ బల్కకుండ.

290


వ.

అని చెప్పి హరి యొనర్చిన కార్యంబులు విని సంతసించి హరి
యావల నేమి చేసెనని యడుగ మునులకు సూతుం డిట్లనియె.

291


చ.

మునివరులార మీ కిపుడు ముచ్చట మీఱఁగ నేను జెప్పెదన్
వినుఁడు పరాత్పరుండు హరి విష్ణుఁడు మర్త్యునిరీతిఁ గాముకుం
డనఁదగి మోహతాపమున నారట నొందుచుఁ బవ్వళించి యే
మనక ముసుంగువెట్టుకుని యార్తునికైవడిఁ జింత సేయుచున్.

292


తే.

వేఁడినిట్టూర్పు విడిచి తా విమలపాన్పు
పైని బొరలుచు దీనునిపగిది నున్న
వకుళమాలిక యచటికి వచ్చి హరిని
గాంచి యిట్లని పల్కె సత్కరుణ మెఱసి.

293


శా.

అన్నా వేంకట లెము లెమ్మిపుడు నీ వాకొంటి వాలస్య మే
మన్నంబుం బరమాన్నభక్ష్యములు నీ కర్పింప నేఁ దెచ్చితిం
జెన్నొందన్ భుజియించు నీ వనఁగ నాశ్రీస్వామి మాటాడలే
కున్నం జూచి మనంబునన్ భయము పెంపొందంగ నాఁ డెంతయున్.

294


సీ.

వికలత్వమును బొంది వకుళమాలిక యిట్టు
        లనియె నాతండ్రి నీ వార్తినొంది
కనుల నీ రిటు నింపఁ గారణం బేమి నీ
        వీవిధంబునఁ జింత యేల పడెదు
పగలు నిద్దురపోవఁ దగదని తెలిసి నీ
        విప్పు డీమాడ్కి నిద్రించు టేల
విపులధైర్యస్థైర్యవీర్యంబులను వీడి
        పోఁ జేసి దీనతఁ బొందు టేల