పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

235


తే.

నని తలంచుచు వైరాగ్య మగ్గలింపఁ
గమలనాభుని హృదయపంకజమునందుఁ
జక్కఁగా నుంచికొని మ్రొక్కి చని రయమున
రమ్యతరమగు కొల్లాపురంబు చేరె.

131


క.

ఆకొల్లాపురివాసులు
శ్రీకమలాదేవి నచట శ్రీకరభక్తిం
బ్రాకటముగఁ బూజింపఁగఁ
జేకొని యాచోటు నుండెఁ జిరకీర్తి దగన్.

132


వ.

ఈక్రమంబుగ లక్ష్మీనారాయణులకుం బొడమిన ప్రేమకలహ
వ్యాజంబున లక్ష్మి కొల్లాపురంబు చేరెననిన సూతుం జూచి
శౌనకాదిమహామును లాశ్చర్యంబంది యిట్లనిరి.

133


శా.

శ్రీనారాయణుఁ డీప్రకారముగ నాక్షీరాబ్ధిజన్ బాసి యా
భూనీళాంగనలందు మోహమును సంపూర్ణంబుగా నుంచి యం
దానందించుచునుండెనో సిరిని నెయ్యంబొప్ప భావించుచున్
దీనత్వంబును బొందుచున్ వగచెనో ధీరాత్ముఁడై యుండెనో.

134


క.

అని శౌనకుఁ డడుగఁగ దగ
విని సూతుం డిట్టు లనియె వెన్నుఁడు సిరిపై
నెనరు మనంబును బెనఁగొనఁ
దనలో నిటు తలఁచె విరహతాపము మీఱన్.

135


సీ.

ఆదేవముని వేంకటాద్రిపై నే లేని
        తప్పు విరించితోఁ జెప్ప నేల
యజుఁడు నారదు నంప నతఁడు మౌనులచెంతఁ
        జేరి మూలప్రశ్న సేయ నేల