పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వ.

అప్పు డాభృగుమునీంద్రునితోడఁ దమలోఁ దాము విత
ర్కించుచు యజ్ఞఫలభోక్తయైన దేవుని వేర్పఱచి చెప్పు
టకుఁ దోచక యూరకుండ నారదుండు చూచి యిట్లనియె.

109


సీ.

మానితాష్టాక్షరీమంత్రార్థమును వీణె
        నందు బల్కించి సానందుఁ డగుచుఁ
బలికె నిట్టులు ప్రజాపతులార మీరు స
        త్క్రతువులు చేసి లోకములయందు
విలసితముగఁ బ్రజావృద్ధిఁ జేసితిరి మే
        లయ్యె మోక్షప్రదుఁ డైనదేవుఁ
డజుడొ పద్మాక్షుండొ హరుఁడొ విచారించి
        ముక్తిప్రదం బైనమూర్తియందు


తే.

సవనఫల మొగి నర్పించి సంతసింపుఁ
డనుచు హిత మొప్పఁ జెప్పి వీడ్కొనె విపంచి
తంత్రులను మీటుచును బరతత్వ మాత్మ
యందుఁ జూచుచు స్వేచ్ఛావిహారి యగుచు.

110


వ.

అమ్మునీంద్రుండు త్రిలోకసంచారంబు సేయుచునుండె.
నజుండు శేషాద్రియందు వల్మీకతింత్రిణీవృక్షంబుల నిర్మాణం
బొనరించి యుంచె. ననంతరంబున.

111


మ.

ఘనుఁడై నారదుఁ డన్నవాక్యముల నాకర్ణించి భావించి య
మ్మునులెల్లన్ గుమిఁగూడి తాము తమలో మూర్తిత్రయంబందు మిం
చిన మోక్షప్రదుఁ డైనవేల్పును పరీక్షించు ప్రకారం బదె
ట్టని యోచించి భృగుండు నేర్చుఁగన నిం కామూర్తిచందంబులన్.

112