పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

227


సీ.

శరదభ్రశుభ్రలసత్కాంతి నిజదేహ
        మందు రప్పింపగా నరుణవర్ణ
కలితజటాజూటకళ లుప్పతిల్లఁగ
        లలిఁ బూర్ణచంద్రకళంక మనఁగ
నొఱవుఁ గృష్ణాజిన మొప్పంగఁ గటియందు
        మధ్యభాగమునందు మౌంజి వెలయ
మెఱపుఁదీవెను దాను మెచ్చక యురమునఁ
        దగిన బంగరుజన్నిదము వెలుంగ


తే.

నారదుఁడు లేచి యప్పు డానలినభవుని
యనుమతిని జాన్హవీతీరమునను జేరి
క్రతువు లచ్చట నొనరించు కశ్యపాది
సంయమీంద్రుల నీక్షించి సవినయమున.

105


తే.

వీణ మీటుచు గానధురీణుఁ డైన
వరమునీంద్రుఁడు సవనపువాటమునకు
రాఁగఁ గశ్యపముఖులు నారదుని జూచి
విహితరీతిని బూజించి వినుతి చేసి.

106


క.

ఘనతం దగ మఱి మును లా
యనిమిషమునివరుని గాంచి యని రిమ్మెయి నో
మునినాథుఁడ భవదాగమ
మున మే మెల్లరును మోద మొందితిమి కడున్.

107


తే.

అనఁగ నిని మౌనులార మీఱంద ఱిచట
యజ్ఞమును సల్పి తత్ఫలం బలర నెవరి
కర్పితంబులు గావింతు రావిధంబు
దెలుపుఁడని వల్క మునులు సందియము నొంది.

108