పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

223


వ.

కారుణ్యార్ద్రచిత్తుండై వరంబు లొసంగుటం జేసి యప్పర్వతం
బునకు వేంకటాద్రి యనునామంబు సార్థకంబయ్యె. వేంకటా
ఖ్యాక్షరత్రయార్థంబు చెప్పుమనిన జనకుంజూచి శతానందుం
డిట్లనియె.

92


క.

విను వేమ్మనుపాపేంధన
మును గటయుగళాక్షరాగ్నిముఖ్యంబై కా
ల్చెను గావున వేంకటగిరి
యని పే రాయద్రి కొప్పె నవనీనాథా.

93


సీ.

మొనసి ప్రాతఃకాలమున లేచి వేంకటా
        ద్రిస్మరణము సేయుధీరు లవనిఁ
గ్రమముగ నూఱు గంగాస్నానములు మఱి
        సేతుయాత్రలు వేయి చేసినంత
పుణ్యఫలంబులం బొంది సుఖంతు రీ
        కథ మద్గురుం డగు గౌతముండు
నాకుఁ జెప్సినంత నీకుఁ జెప్పితి నిది
        వినినవారికి శుభవితతు లొదవు


తే.

వసుధ నిహపరసుఖములు వలసినట్టి
వార లీకథ వినవలె వాంఛమీఱ
నని శతానందముని చెప్పెనందువలన
జనకుఁ డావేంకటాద్రికిం జనఁదలంచి.

94


వ.

మంత్రిప్రముఖులం దోడ్కొని శతానందునితోడ వేంకటా
ద్రికి వచ్చి స్వామిపుష్కరిణియందు స్నానాదులు చేసి భూవ
రాహ శ్రీనివాసులసాన్నిధ్యంబునఁ గొన్నిదినంబు లుండి
క్రమ్మఱ మిథిలాపురంబు చేరె. నివ్విధంబు వేంకటాద్రిదర్శనంబు