పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


ఉ.

వానిశిరంబు మూర్కొనఁగ వాఁడు కృతార్థుఁడ నైతినంచుఁ దా
నానళినోద్భవుం బొగడి యంజలి చేసి భయంబు మీఱఁగా
దీనత నొంది యిట్లనియె దేవ వివేకము లేక పాపముం
బూని యొనర్చితిం బరమపూరుష నాగతి యెట్లు చెప్పుమా.

88


తే.

అనుచు వాఁ డార్తిఁ బొందుచు నడుగ నజుఁడు
పల్కె నిమ్మెయి నోవిప్ర! పాప మెల్ల
భస్మ మైపోయె సంశయం పడకు మింక
వేంకటాద్రికి నీవు వేవేగ నరిగి.

89


సీ.

స్వామిపుష్కరిణిలో స్నానంబుచేసి యా
        భూవరాహస్వామి పూజ సల్పి
మ్రొక్కుచు నీదేహమును విసర్జించుము
        తదనంతరంబు భూతలమునందు
ధన్యత పాండవదౌహితృవంశజూఁ
        డగుసువీరునిసుతుఁడై జనించి
నట్టి సుధర్ముని కాత్మసంభవుఁడవై
        వసుధ నారాయణవనపురమున


తే.

నిలిచి హరిభక్తి నెద నుంచి నిర్మలముగఁ
దొండమండలదేశ మఖండధర్మ
మార్గమున నేలుచుండు రమావిభుండు
పెండ్లియాడును నీపుత్త్రిఁ బ్రేమ దనర.

90


తే.

లక్ష్మియ కుమారిగా నీకు లక్షణాంగి
గల్గు శ్రీహరి కిచ్చి సౌఖ్యంబుగాను
బోయి వైకుంఠమును జేరు భూసురుండ
ననుచు మాధవునిం గని వనజభవుఁడు.

91