పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


మ.

అనుచుం దన్నుఁ దిరస్కరింప విని రోషావేశ ముప్పొంగ ని
ట్లనియెన్ శేషుఁడు మారుతా యెపుడు నా కాహారమైనట్టి నీ
వనఁగా నెంతటివాఁడు నాయెదుట నీయార్భాటముం జెల్లునే
యనఁగా నప్పపనుండు వల్కె విని కోపాటోపముం జెందుచున్.

46


క.

శేషా గర్వంబున దు
ర్భాషలు భాషించి నీవు పట్టుగ నాకున్
రోషము వుట్టించితి విఁక
భాషింపఁగ నేల పొమ్ము ఫలమందె దొగిన్.

47


వ.

అయినను నాబలంబునకు నీబలంబునకు గజమశకన్యాయంబై
యుండు నేను సర్వజీవాంతర్యామియునై జగత్ప్రాణుండ
నైయుందుఁ గావున నీకంటే నే నధికుండ ననిన విని యురగే
శ్వరుం డిట్లనియె.

48


సీ.

విను మనిలుఁడ నేను విపులాద్రిగణముతో
        మొనసి భూమిని శిరంబున భరింతు
బహువిధబ్రహ్మాండభాండోదరుం డైన
        నీరజాతాక్షుని నే భరింతుఁ
గాన నీకంటెను నేన గొప్పగుచుందుఁ
        జులకఁదనంబుగఁ జూడవలదు
పొమ్మని వల్కఁగ భూరికోపంబు మైఁ
        బవనుఁ డిట్లనియె నో పన్నగేంద్ర


తే.

నేను నీలోన నుండఁగ నీకు బలము
గలిగియున్నది లేకున్న ఘనతరమగు
నీబలం బేడ నిలుచును నాబలంబు
ముందటను నీవు తక్కువ యెందుఁగాని.

49