పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

శ్రీ వేంకటాచలమాహాత్మ్యము


సీ.

వృషభాసురుం డనువీరుఁ డాకొండపైఁ
        జేరి మౌనుల హింస చేయుచుండ
నట్టిబాధలు వరాహస్వామితోఁ జెప్ప
        వలె నంచు వాకిళ్ల వచ్చి మ్రొక్కి
ప్రార్థించి పల్కిరి పరమాత్మ యీశైల
        మున వృషభాసురుం డనెడువాఁడు
వచ్చి మ మ్మనయంబు బాధించుచున్నాఁడు
        నయమున మించి యారాక్షసేంద్రుఁ


తే.

ద్రుంచు డని వేఁడ నాస్వామి యెంచి దయను
బల్కె మునులార మీరు నిర్భయముగాను
దపము లొనరించుకొనుఁడు నాదైత్యు నింక
యమునిపాలికి నంపెద యశము మెఱయ.

22


వ.

ఆకిటిరూపుం డవ్వారి నప్పుడు వీడ్కొనఁగ నమ్మునులు తమ
నెలవుల కేగి భయంబు మాని తపంబు లొనరించుకొనుచుండిరి.

23


తే.

దేవరిపుఁడును దుంబురుతీర్థమునను
మూఁడుకాలంబులను స్నానములు నొనర్చి
చిత్త మలరఁ గరాళనృసింహమంత్ర
జపము చేయుచుఁ బూజలు సల్పుచుండి.

24


వ.

తత్పూజానంతరంబు నిజశీర్షంబును దనఖడ్గంబున ఖండించి
హరి కర్పితంబు సేయుచుండ నాస్వామికరుణ నాశిరంబు
గ్రమ్మఱ గంఠంబున నిలుచుచుండు నవ్విధంబునఁ బంచ
సహస్రాబ్దంబులు చేసినపూజకు మెచ్చి వరాహస్వామి కరాళ
నృసింహరూపంబున వానికిఁ బ్రసన్నుం డైనం జూచి వృష