పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

95


లోకములను మఱియు వైకుంఠముఁ జూచి
కట్టకడకు నిటకుఁ బట్టువట్టి.

75


క.

మీపాదములను బడితిమి
తాపము సెడె వచ్చితిమి ముదంబున ధర నా
బాపాత్ముఁ డైన రావణు
నేపగిదిం జంపి మమ్ము నేలు ముకుందా.

76


వ.

అని యనేకవిధంబుల నుతింప నక్కమలాక్షుం డాబ్రహ్మాది
దేవతలం జూచి నగుచు నిట్లనియె.

77


చ.

జలజజముఖ్యులార మిము సత్కృప మీఱఁగ నేన గాచెదన్
ఖలుఁడగు రావణాసురుని ఖడ్గముపాలును జేయుదేను మీ
రలరఁగ నబ్ధి దాఁటి భయమందకుఁడింక సుఖంబు నుండుఁడం
చెలమిని బల్కుచుండ శివుఁడేగి నుతించి నయోక్తులారఁగన్.

78


సీ.

మర్త్యలోకమునకు మనుజాశనుల వేధ
        దప్పింప శేషభూధరమునందు
నిలిచి మానవులకు నీవు ప్రత్యక్ష మై
        యుండ రాక్షసులు రాకుందు రిటకు
నవల నెప్పుడు నిన్ను నందఱు సేవించు
        చుందురు నిర్భయ మొంది యిచటఁ
బొసఁగ నీ కీ గిరి భూలోక వైకుంఠ
        మగుచుండు నేను బాయక వసింతుఁ


ఆ.

గాన నాకుఁ దగిన తానకం బొండిందుఁ
జూపు మిర్వురమును సురగణంబు
పొగడ నుంద మంచు నగజేశుఁ డనఁగ నా
చక్రి నగుచు ననియె శంకరునకు.

79