Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

పరఁగ నొక్కపెట్ట బలువడిఁ జనుదెంచు
చైద్యపక్షరాజసైన్యములను
వనధి నిమ్నగాప్రవాహంబులనుబోలె
నడ్డగించె నొకఁడె హరిసుతుండు.

140


వ.

ఇ ట్లతిరభసంబుగా హరిణంబులమీఁదికిం జనుసింగంబుభంగిఁ గవిసిన
ప్రద్యుమ్నునిమీఁద విలసదయోమయకవచు లగుటం జేసి నీల
మేఘసామ్యంబు నొందిన తత్సైనికులు ప్రయోగించిన సువర్ణ
పుంఖసాయకంబులు శంపాలతలకైవడిఁ బ్రకాశించె నప్పు డా
ప్రద్యుమ్నుండు నఖకిరణమంజరీవ్యాప్తయు నధిరూఢశిలీముఖ
యు నైనమహాకార్ముకశాఖను ధరించి మహోన్నతవృక్షంబు
పోలికఁ బ్రకాశింపుచు రిపుసమూహాంతకుం డగుచు నతిభయంకర
యుద్ధంబు గావింపుచు నమ్రులైనవారియందు సౌజన్యంబుఁ
జూపుచు నుద్వృత్తులైన ప్రతిపక్షులబాణంబులచేత విచారింపుచు
మఱియు సర్వమహీపతులు విజయాశంసచేత నగ్రభాగంబునఁ
బ్రయుక్తానేకబాణంబుల బాణంబులచేత ఖండింపుచుఁ గృతా
నేకమాయయై సారవంతంభై యున్న సేనాతతిని ధనుష్టంకార
మాత్రంబున ననాయాసంబుగా మూర్ఛ నొందింపుచు సమర
సన్నాహవిజృంభితుండై విహరింపుచుండ నప్పుడు.

141


గీ.

ఉత్తమౌజుండు దలపడ్డ నుగ్రుఁ డగుచుఁ
గార్ష్ణితత్తేజమును దూరగతముఁ జేసి
వానిపేరి కసార్థకత్వము నిజాభి
ధేయమునకును ముఖ్యార్థంబు దెలియఁజేసె.

142


గీ.

దూరముననుండి శౌరిపుత్రుండు భల్ల
బాణములు పరసేనల బడలుపడఁగఁ
జేయ నవి మూర్ఛఁ దేఱి స్వజీవితాశ
మఱల రణభూమి ద్రొక్కక పఱచె నపుడు.

143


క.

హరిపుత్త్రునిచే శరములఁ
బరిపీడితు లగుచు విడువఁబడిన యరాతుల్
గరము విలక్షత నొందిరి
వరశరములు నొందవయ్యె వైలక్ష్యంబున్.

144


క.

అపు డాప్రద్యుమ్నుని రణ
నిపుణత నీక్షించి మింట నిలిచి సుపర్వుల్
విపులపులకాంకతనులై
యపరిమితోక్తుల నుతించి రట మునియుతులై.

145