Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నంఘ్రివిక్షేపమున దివ మాక్రమించి
పొసఁగ శశిసూర్యమండలములను దాటి
మూఁడు పదములఁ దృటిలోన ముజ్జగంబు
లాక్రమించె నీమహనీయుఁ డద్భుతముగ.

225


సీ.

గగనంబు లంఘించి నగముభంగి గరీయ
                        మైన మహోచ్చదివ్యాంఘ్రిచేతఁ
గ్రాంతకంధరుఁడైన గతిదుర్బలుండైన
                        బలి వాసవునకు సుబద్ధుఁడయ్యె
నింద్రనీలచ్ఛాయ నెసఁగు తదూరువు
                        కడుదీర్ఘమై దూరగతము నగుచు
వ్యోమంబు దాఁటి తదూర్ధ్వముఖంబుగాఁ
                        జనుచుండ స్వర్ణదీస్పర్ధచేత


గీ.

దానిపయి కుద్గమించి యందముగఁ బాఱు
భానుతనయాప్రవాహంబుభాతి సురలు
గాంచి యచ్చెరువంది రిక్కరణి దేవ
హితముఁ జేసిన ధన్యాత్ముఁ డితఁడె సుమ్మి!

226


వ.

మఱియు నమృతవిభాగకాలంబున శిరశ్ఛేదంబుచేత బద్ధవైరుం
డైన సైంహికేయుం డీహరి కపకృతి సేయ సమర్థుండుగాక యతి
రమ్యంబైన తదీయవదనంబుతో సాదృశ్యంబు నొందిన శశాంకు
నిప్పటికి బాధింపుచున్నాఁడు. అనపాయస్వరూపకుం డగుటం జేసి
యప్రతిహతస్మరణశక్తిగల యీకృష్ణుం దుపదేశపరంపరాపగ
మంబువలన నధ్యయనవిచ్ఛేదంబు నొందిన వేదంబులను గ్రమ్మరఁ
బ్రతివర్తింపం జేయుటకు నత్రిగోత్రంబునందు దత్తాత్రేయనామ
కుండై జనియించె మఱియు నితండు పరశురామావతారంబు
నొంది యర్జునకాంతారంబును వినాశితప్రచురపత్రసంపత్తి గలు
గునట్లుగా విలూనభూరిబాహుశాఖంబుగా సముజ్ఝితచ్ఛాయం
బుగా నొనరించె మఱియు నివ్వాసుదేవుండు రామనామంబున
దశరథునకుఁ బుత్రుండై జన్మించి విధ్వంసితదృప్తదశాననం బైన
లంకను దేజంబుచేత నధికవిభీషణంబుగా నొనరించె నిప్పు
డింద్రశత్రువులైన రాక్షసుల సంహరించుటకు విరించిచేతఁ
బ్రార్థితుండై వసుదేవవామఁకుండైన కశ్యపునకుఁ గృష్ణాభిధా
నంబున నవతరించె నిమ్మహాత్మునిచరిత్రంబులు లోకపవిత్రంబులు
భవలతాలవిత్రంబులై యుండు నిమ్మహానుభావుని ప్రభావంబు
గొంత యెఱింగించెద వినుము.

227