వేటూరి ప్రభాకరశాస్త్రి
33
"యథా యకారాదిపదం రత్యుత్సవనిరూపణే”
అన్న యాచార్యదండియనుశాసన మిక్కడ నాఁగలేదు. బ్రాహ్మణుఁడు భ్రష్టుఁడై చండాలకన్యతో సంగమించుటను జెప్పు సందర్భమున నీయశ్లీలము గొంత యౌచితి గలదేయగునని తలఁచి నిరంకుశుఁడై శ్రీనాథుఁ డిట్టిరచన జేర్చెను.
క్రీడాభిరామమందలిరచనలు నిట్టివే. ఆంధ్రకవులలో శ్రీనాథునకుఁ బూర్వ మిట్టిరచనలను జేసినవారు గానరారు. నన్నిచోడఁడు మాత్రము :
క॥ స్మరమందిరమ్ము శోభా
కరముగ మెఱుఁగారుపసిఁడికంబము లనఁగాఁ
గరమొప్పు నగతనూజకుఁ
గరభోరులు వొలుచు మదనకరికరలీలన్. (కుమారసం. 3-48)
గీ॥ అదిమి పట్టినఁ గరులైనఁ జదియునట్టి
కడిఁది బలులగు మగలొత్తి గౌఁగిలింపఁ
గుసుమకోమలు లగుసతుల్ గొసరుచునికి
గనియు నెఱుఁగవె విపరీతకామశక్తి. (కుమారసం. 4-79)
అని యించుక హద్దుదాటి కుమారసంభవమున రెండుపద్దెములఁ జెప్పెను.
శ్రీనాథుని శీలము
సత్ప్రబంధములందుఁ గూడ నిట్టిరచనలను సంకోచింపక నిరంకుశముగాఁ జొప్పించుటకు శ్రీనాథుని శీలమెట్టిదై యుండఁదగునో యించుక యోజించిన గోచరించును. శివరాత్రి మాహాత్మ్యమును జెప్పు పవిత్రగ్రంథమున సంస్కృతమూలమున లేని చండాలాంగనా బ్రాహ్మణబ్రువ సంభోగసంభారమునంత సంపూర్ణముగా వర్ణించియే తీఱవలెనా? కాశీఖండమున ననుచితముగాఁ గంచియఱవతల ముచ్చటను బచ్చిగా వర్ణింపవలసినదే? హరవిలాసమున శివలింగోత్పత్తి కథ నంతకంటె సభ్యముగా సాగింపఁదగదా? సత్ప్రబంధములందే లేని జంకుఁగొంకులింక రసికులకొఱకే రచితమయిన క్రీడాభిరామమునఁ జూడఁబడునా? అనావశ్యకము లయినపట్టుల గూడ నిట్టి రచనములను హెచ్చుగాఁజేర్చుటను జేసియు, సరసమయిన శృంగారసందర్భములం దింపులు సొంపులు పొంపిరి వోవునట్లును, క్షుద్రహృదయులు గూడ రసార్ద్రహృదయులగునట్లును నమృతధారవంటి కవితాధార నలుఁగులు వాటించుటం జేసియుఁ, జాటుమాటు లేక తన స్వైరవిహారమును చాటుధారలలోఁ జాటుటంజేసియు, సర్వాంధ్రదేశము నందును, నందును బల్నాట స్థలనిర్దేశ నామనిర్దేశములతోఁ