Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

429

జరిగిన సత్కారము రసచమత్కారకలితము. అక్బరు తన పట్టాభిషేకము నాడయిన భిల్లలేఖ ప్రకటనము నాటి మహోత్సవమున నుభవించెనో లేదో యనదగినట్లు కవితావిలాస మక్కడ వెలసినది.

అక్బరు ప్రతాపసింహుని లేఖఁ గొనివచ్చిన బిల్లునియునికి సభలో


గీ॥ దుద్దుఁగంబడి బుజముల దుడ్డుకఱ్ఱ
     కరమున నెసంగు గంభీర కాలమూర్తి!
     భిల్లుడు వసించెనొక దొడ్డపీటపైన
     వేదికాంతమందక్బరు విభుఁడుచూప. (4 ఆ 209 ప)

ఆ॥ అల్ల వాఁడె భిల్లుడంట యక్బరు శాహి
      యోలగమునఁ గూరుచుండెనంట
      నా ప్రతాపు దూతయట యితండనిమేడ
      లెక్కి నిక్కిచూచి రింతులెల్ల - (4 ఆ 297 ప)


అబ్దుల్ రహిమాను లేఖలోని ముక్కలు రెండు -


గీ॥ బరువుపడ కిన్నియేండ్లు కాపాడినాఁడ
     వనఘ స్వాతంత్ర్య కనక గర్భాలయమునఁ
     బ్రజ్వరిల్లు నఖండ దీపమ్మునిపుడు
     కొండ యెక్కింతువే కనుగూర్కిదేవ ! (4 ఆ 328 ప)

గీ॥ సంగర తరంగ సంక్షుభితాంగమగుచు
     నలముకొనియున్న బహువిపదబ్దియందుఁ
     జెక్కుచెదరక చిక్కక సేమమునను
     నడచెడును గాక యుష్మదానందనౌక ॥ (4 ఆ. 334ప)


చతుర్ధాశ్వాసము ముగిసినది. పంచమాశ్వాసము మరల యుద్ధమే. పరాజయములే. ధనము లేదు. ధాన్యములేదు. స్వాతంత్ర్యముతో నిలువ నీడలేదు. దేశభ్రష్టుడ నగుదునుగాకని ప్రతాపుఁడు తలఁచెను. తోడివారు సలుంబా కృష్ణసింహాదులెల్లరు వెంటవత్తుమనిరి. ఈ ఘట్టమున కవిగారు తమ కవితలోఁ గరుణరస వర్షము కురిపించినారు.