Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

368

ధనుర్విద్యావిలాసము

పాటలు నేర్చిన వారిని రక్షించేవాఁడు, ప్రేమగలవాఁడు, వదులు కంకణాలు గలవాఁడు, పానీయశాలలుగలవాఁడు, నన్నన్ అని పేరుగల వాఁడుగను, వెణ్మని (వెల్మని) బచ్చలి తీగలవ్నతి ( చెంచ) గల వియలూరు అను గ్రామము అని పై నేదోయున్నది. వెణ్మాన్, వెల్మన్, వేళాలన్, వెల్లాళన్ అన్నీ ద్రవిడమునఁ బర్యాయపదములట. [1]

ఐక్ష్వాకులు మొదలగు క్షత్రియు లంధ్రదేశమునకు వచ్చి రాచఱికము నెఱపి, ద్రవిడ దేశమునకును వ్యాపించి (శ్రీరంగనాథస్వామి యిక్ష్వాకుల నాఁటి కథలు ) యుండవచ్చును. తెలుఁగు దేశమున క్షత్రియులు అట్లే వెలుమవారును క్షత్రధర్మముతో తెలుఁగు దేశమున వర్ధిల్లి ద్రవిడదేశమునకును జేరియుండవచ్చును. బసవపురాణమున వెల్మనికథ యొకటి హృద్యమైనది కలదు. అది ద్రవిడదేశపు శివకవియగు సుందరమూర్తినాయనారు నాఁటి కథ, అది తెలుఁగున నున్నట్లు గాక ద్రవిడమున పెరియపురాణమునఁ గొంత భేదముతో నున్నది. వెల్మలను గూర్చి చాటువు.


ఉ. పైకొనువారితో నొరఁగిపాఱరు, నేరరు భంగసంగతుల్
    చేకొనఁబూనికాని దొరఁజేరరు కోరరు దుష్టజంతుర
    క్షాకరణంబు నొడ్లకపకారులుగా రెపు డప్పుగోరు మం
    దాకినితోడబుట్టియు గుణప్రతిభన్ వెలుమల్ పురంబునన్.


కాళహస్తి, వెంకటగిరి, నూజివీడు, పిఠాపురము, బొబ్బిలి, మైలవరము, నరసారావుపేట, పెదపవని, కొల్లాపురము, తిరువూరు, రేపల్లె, రాచూరు, ఉల్లిపాలెము, మొదలగు స్థలముల వెలుము వారిప్పటికిని జమీందారులుగా నున్నారు. అందు మన కిప్పుడు ప్రసక్తులు, రేపల్లె, రాచూరు, జమీందార్లగు మాణిక్యారావువారు. వీరితొల్తటియింటిపేరు కృష్ణానేనివారు. వీరు పుణ్యపలిగోత్రమువారు. తొల్తవీరు తెలుంగాణమున (నైజాం రాష్ట్రమున) నుండిరి. ఇప్పటికిని వీరిబంధువులు, అనుమకొండ దగ్గఱ పెదపెండ్యాలలో 'పొట్లపల్లివారు ' అనఁబరగుచున్నారట. వీరికి మాణిక్యారావు వారని బిరుదు
  1. తిరుపతి శ్రీవెంకటేశ్వర రీసర్చి ఇన్‌స్టిట్యూట్‌లో అరవరీడరుగానున్న శ్రీపళనియప్పపిళ్ళగారీ విషయము తెల్పిరి.