Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

అన్నమాచార్యచరిత్ర

నూలినేతచే వస్త్రములు గల్పించి లోకమును నాగరకపఱిచి యుద్ధరించువా రయిన సాలెవారి కీతఁ డాచార్యపురుషుఁడు. వారి వంశమర్యాదల కీతఁడు సంరక్షకుఁడుగా నుండెను. సాలెవారు వీరికి పదివేల వరహాలు పాదకానిక సమర్పించిరి. చిన్నన్న వంశపారంపర్యముగా దమవంశపారంపర్యముగా గురుశిష్యతాసంబంధము వర్ధిల్లఁ గోరిరి. ఇందుకు తామ్రశాసనము వెలయించిరి.[1]

కోనేటి తిరువెంగళనాథుఁడు

ఈతఁడు సదాశివరాయలచే క్రీ 1544, 1545 అద్దంకిదగ్గఱి బొల్లాపల్లి ఓలపల్లి అని రెండగ్రహారములఁ బడసినాఁడు. క్రీ 1559 లో కడపజిల్లా పుష్పగిరి చెన్నరాయనికిఁ గొంతభూమి సమర్పించినాఁడు. ఈతఁడు గొప్ప వైభవ మనుభవించినాఁడనుటకీ క్రిందిపద్యము సాక్షి.


సీ॥ మొకరి వాతెర కీర్తిముఖము బంగరుదండె
            పాలకి యేగురుం డోలి నెక్కె
     శ్రీజగన్నాథునూర్జితపదాంభోజముల్
            సేవించి యేబుధాశ్రితుఁడు వెలసె
     కాయసిద్ధిని లంబికాయోగమార్గంబు
            తెలిసి యేఘనుఁడు సాధించి నెగడె
     భక్తితోఁ బట్టాభిషిక్తులు ధరసాగి
            మ్రొక్క నేవిభుఁడు పెంపెక్కి చెలఁగె

     నతఁడు పొగడొందు హారనీహారగంధ
     సారకర్పూరగోక్షీర సదృశయశుఁడు
     ఘనుఁడు పెదతిమ్మదేశికగర్భజలధి
     కువలయాప్తుండు కోనేటిగురువరుండు ॥[2]


తిరువెంగళప్ప

ఈతఁడు గొప్పవిద్వాంసుఁడు. ఆమరుకావ్యమును దెలిఁగించినాఁడు.
  1. చూ. తామ్రశాసనము. శ్రీ.వెం. ఓ. జర్నల్. 1 వాల్యుం. 1 పార్టు.
  2. ఈ పద్యము శ్రీ తాళ్ళపాక సూర్యనారాయణయ్యగారి వ్రాఁతకాగితములనుండి కైకొంటిని.