Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

అన్నమాచార్యచరిత్ర

అమ్మకు అలమేల్మంగకు పద్యశతము చెప్పితిననెను - కనుక నిదియలమేల్మం గాంబికాస్తుతి శతకమేయనఁదగినది.

అన్నమాచార్యచరిత్రలో నన్నమయ కొండ నెక్కునాఁటి కెనిమిదేండ్ల వాఁడనియున్నది గాని, దాని నుపనయనముచే ద్విజత్వము వచ్చిన దాదిగా నని యన్వయించుకొని యెనిమిదేండ్లవాఁడని, మాతృగర్భమున నుండి పుట్టిన దాది పదునాఱేండ్లవాఁడని సరిచూచుకోవలెను. కొండనెక్కు నాఁటి కాతఁడు సంకీర్తనకర్త. పదునాఱవయేఁట స్వామి ప్రత్యక్షమై సంకీర్తన రచనానుగ్రహము చేసినాఁడని రాగిఱేకుమీఁదనున్నది.

త్రోవభాష్యకారులు

దేశాళం


               గతులన్ని ఖిలమైన కలియుగ మందును ।
               గతి యీతఁడే చూపె ఘనగురుదైవము. ॥పల్లవి॥

ఈతనికరుణనేకా యిల వైష్ణవులమైతి।
మీతనివల్లనే కంటి మీ తిరుమణి
యీతఁడే కా వుపదేశ మిచ్చె నష్టాక్షరమంత్ర।
మీతఁడే రామానుజులు ఇహపరదైవము ॥గతు॥

వెలయించె నీతండెకా వేదపురహస్యములు ।
చలిమి నీతండె చూపె శరణాగతి ।
నిలిపినాఁ డీతండెకా నిజముద్రాధారణము ।
మలసి రామానుజులే మాటలాడే దైవము ॥గతు॥

నియమము లీతండెకా నిలిపెఁ బ్రపన్నులకు।
దయతో మోక్షముచూపెఁ దగ నీతండె।
నయమై శ్రీ వేంకటేశునగ మెక్కీ వాకిటను ।
దయఁ జూచీ మమ్ము నిట్టే తల్లిదండ్రి దైవము ॥గత॥
                                        అన్న. అధ్యా. 175 ఱేకు.