Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

అన్నమాచార్యచరిత్ర


నున్నఁగా సంకీర్తన నానోరి కిచ్చితి గనుక।
నన్ను రక్షింతువే యనుచు నమ్మితి నేను।
పిన్ననాఁడే నీవు నన్నుం బేరుకొంటివి గనుక।
యెన్నంగ నీడేర్తువని యియ్యకొంటి నేను ॥సందే॥ 1

శ్రీకాంతుఁడ నీమూర్తి నాచిత్తములో నిల్పఁగాను ।
నాకు నీవు గల వని నమ్మితి నేను ।
దాకొని లోకములో నీదాసుం డనిపించఁగా।
ఈడక నేలితి వని యెఱిఁగితినేను ॥సందే॥ 2

కైవసమై నీవు నాకుఁ గలలో నానతియ్యఁగా।
నావద్ద నున్నాఁడవని నమ్మితినేను ।
ఏవేళా శ్రీవేంకటేశ యెదుటనే వుండఁగాను ।
పావనమై యిన్నిటాను బ్రబలితి నేను ॥సందే॥ 3

                                      అన్న. అధ్యా. 2వాల్యుం 244 పేజి.


తిరుపతికిఁ బయనము

అన్నమయ కాడినమా టెల్ల నమృతకావ్యముగాను పాడినపా టెల్లఁ బరమగానముగాను గాఁజొచ్చినవి. తిరుపతి యాత్రకుఁ బయనమయ్యెను. పరుసగుంపువారిట్లు పాడఁ జొచ్చిరి. ( చూ 13 పుట.)


               వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ॥పల్లవి॥

ఆమటి మ్రొక్కులవాఁడే ఆదిదేవుఁడే వాఁడు
తోమని పళ్యాలవాఁడే దురితదూరుఁడే ॥వేడు॥ 1

వడ్డికాసులవాఁడే వనజనాభుఁడే పుట్టు
గొడ్డురాండ్రకు బిడ్డలనిచ్చే గోవిందుఁడే ॥వేడు॥ 2

ఎలమిఁ గోరినవరా లిచ్చే దేవుఁడే వాఁడు
అలమేల్మంగా శ్రీ వెంకటాద్రినాథుఁడే ॥వేడు॥ 3
                            తాళ్ళపాక శేషాచార్యులుగారి వ్రాతప్రతి.