Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

171

బెంపొందెను. ఇట్లు పాత్రబాహుళ్యముకూడఁ గలవైన యక్షగానములందు సంధివచనములఁ జెప్పు కోణంగి, లేక సూత్రధారుఁడు 'వచ్చెనమ్మా సత్యభామ - ' ఇత్యాది విధములను, 'అంతట హనుమంతుఁ డేమనుచున్నాడు' ఇత్యాది విధములను బాత్రములఁ బేర్కొనగాఁ దద్వేషధారులు వచ్చి తమ యాటపాటలు నెఱపుదురు. ఇట్లింకను బెంపొందిన యక్షగానములు తెరలు, రంగభేదములు కలవయి కొంత సంస్కృత నాటకచ్ఛాయయుఁ జొప్పడఁగా నాటకము లను పేరను గూడఁ బదునెనిమిదవ శతాబ్దినాఁటికిఁ బేర్వలసినవి.

ఇంచుమించుగాఁ దెలుఁగున నేనూఱింటిదాఁక లెక్కింపఁ దగియున్న యక్షగానములలో సుగ్రీవవిజయ మొకప్రశస్త కృతి.

దాని కర్త

కందుకూరి రుద్రకవి.

ఈతఁడు విశ్వబ్రాహ్మణవంశ్యుఁడు. కందుకూరికిఁ జేరువనే పాలేటి యొడ్డునఁగల చింతలపాలె మనుగ్రామ మీతని యూరు, ఆయూరనే తద్వంశ్యు లిప్పటికిని గలరు. రుద్రకవి మూలమున నా వంశమువారికి 'కవిగారు' అని యుపనామ మేర్పడినది. ఆ వంశమున రుద్రకవికిఁ దర్వాతఁ బలువురు రుద్రకవినామకులుండిరి. తొలుతటి రుద్రకవి కృష్ణదేవరాయల యాస్థానమున నష్టదిగ్గజము లనఁబడుకవు లెనమండుగురిలో నొక్కడుఁగా నుండెనఁట[1]మల్కిబ్రహీంకాలమునఁగూడ నొక రుద్రకవి యుండెను. ఇబ్రహీం కాలమునఁ గలరుద్రకవియే కృష్ణరాయలకాలమున బాలుఁడుగా నుండబోలును. చింతలపాలె మనుగ్రామము మల్కిబ్రహీంప్రభువే రుద్రకవి కొసఁగెను.


అద్యాశీతిచతుశ్శతాధిక సహస్రం వై శకాబ్దా గతాః
అస్మిన్ శ్రీజయవత్సరే జయతిధౌ మాసే చ మాఘే తథా
పంచమ్యాం ద్వయతింత్రిణీజనపదం రుద్రస్య విద్వత్కవేః
ప్రీత్యా శ్రీయిభరామభూపతి రదాత్ క్షోణీధరాఖండలః॥

  1. రుద్రకవి విషయమును చాటుపద్యమణిమంజరి ద్వితీయభాగమునఁ జూచునది.