Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

ఉత్తరహరివంశము

ప్రాస విశేషములు


క. అరిగరమున నేఁదాల్చిన, నరిగరము నగేంద్రధీరుఁడైనం జెడఁడే
   యరి దిరమై నన్నడుగుట, యరిది రమైకాభిలాషులగు నృపతులకున్.
                                                                        చతుర్థాశ్వాసము.


ఈ కవి ప్రయోగించినపదములు కొన్ని యితరత్ర గానరాకున్నవి. శబ్దరత్నాకరమునఁ జేరనిపదము లీ కవికృతిలోఁ బెక్కులున్నవి.

'గండారపుబొమ్మ' అనుపదము నీతఁడు ప్రయోగించినాఁడు. శబ్దరత్నాకరమున నిదిలేదు. దీనికిఁ బలువురు పలుదెఱఁగుల నర్థముచెప్పుచున్నారు. దేశ్యనామార్థకోశమున, 'గండారపు బొమ్మనఁగా, మండలమున దృష్టిబొమ్మ' అని యున్నది. ఇట్టివి యీ కృతిలోఁ బెక్కులున్నవి.

బమ్మెరపోతరాజాదు లీ కవీశ్వరునిరచనల ననుకరించిరి. శ్రీ రాళ్ళ పల్లి అనంతకృష్ణశర్మగారు, వేలూరి శివరామశాస్త్రిగారు, నడుకుదుటి వీరరాజుపంతులుగారు మొదలగువా రీకవీశ్వరుని దేశకాలములను గూర్చియుఁ గవితారీతులను గూర్చియు నిదివఱకుఁ గొంతవిపులముగా విమర్శముల వెలయించిరి. ఆయా సమయములందు నేను వానిని జూచితిని గాని యీలఘు పీఠిక వ్రాయునాఁడు నాకు శ్రీ వీరరాజుపంతులుగారు సాహిత్యపరిషత్పత్త్రిక 12, 13 సంపుటములందుఁ బ్రకటించిన సోమునిహరివంశము' అనువ్యాసమే చూడఁగల్గెను. పయిఁబేర్కొనఁబడినవారు విలువగల విషయములెన్నో వారివారి విమర్శనములందుఁ జెప్పిరి.

తంజావూరిలైబ్రరిలో నుత్తరహరివంశమునకు రెండు వ్రాఁతప్రతులున్నవి. వానిఁ జూచి నేను గొన్నిపాఠభేదములను గూర్చుకొంటిని. శ్రీ వేంకటగిరి సంస్థానాధీశ్వరుల పుస్తకశాలలో నొక వ్రాఁతప్రతియున్నది. అది ప్రాయికముగా బహుజనవల్లి సీతారామాచార్యులుగారికి వీరేశలింగముపంతులు గారికిఁ జేకుఱిన ప్రతిని బోలినదే. దానిలోఁ బ్రథమాశ్వాసములేదు.

ప్రాచ్యలిఖితపుస్తకశాలలో నొక తాళపత్రప్రతికలదు. పయిప్రతులలోని పాఠములుగూడఁ గొన్ని యీ ముద్రణమునఁ గైకొనఁబడినవి.