Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

క్రీడాభిరామము

నెగువను కృష్ణడాపలియొడ్డునఁగలదు.) మందరము గ్రామముయొక్కయు, దాని లంకయొక్కయు హద్దులలో : "వాయవ్యాం పేరకమ్మనుండి వెళ్ళిన ఇనుంగాలి కాల్వతలపొలమేర” అనియు, “మందరానకున్నూ వెలంగపూండికిన్నీ వాయవ్యము పేరకమ్మనుండి వచ్చినపాయేటితలపడుమటి సీమగాను మందరపు లంక" అనియుఁ గలదు. ఇందు కృష్ణగూడ సరిహద్దులలో వేఱుగాఁ బేర్కొనఁబడినది. 'పేరకమ్మ' పదము గుండ్లకమ్మ వంటిదేమో: అది కృష్ణప్రక్కగాఁ బాఱుచుండిన వేఱకయేఱగునేమో: ఈ విషయ మింకను విచారింపవలసియున్నది. [1] మనకథా పాత్రములు వేశ్యవాటిలో పాములవాని నాగస్వరపుఁబాట, పాములాట, గడీని గంతులు, మేషయుద్ధము, కుక్కుట యుద్ధము చూచిరి. అట పోయి దక్షిణమున 'మధుమావతి' యనువేశ్య యిల్లుగాంచిరి. మధుమావతి మన మంచెనశర్మగారి తండ్రి యగుమాధవశర్మకు ననుపుఁగత్తె. మధుమావతి చెల్లెలగు మదాలస యీ మంచెనశర్మ మేనమామ యగు మీసాలప్పయద్వివేదులకొడుకు శ్రీధరుఁడు పరిగ్రహించిన ననుపులంజె. అక్కడి వింతలవర్ణనము కొంత. అప్పటికి సూర్యుఁడస్తమించెను. వేశ్యవాటిలో జరుగు జారధర్మాసన ప్రశంస గొంత గలదు. ఇట్టిది శ్యామిలకుని పాదతాడితక ప్రహసనమునఁగూడ నున్నది. పిదప, గోధూళిలగ్నమున మన కథాపాత్రము లిర్వురును నార్యవాటికఁ జేరిరి. ఒక్క తమ్మడిసానియింట విడిసిరి. ఆయింటి పూజరివిధవచేతఁదన రాకఁ గామమంజరికి మంచెనశర్మ యెఱిఁగించెను. నిండువెన్నెల గాయుచుండగా శివనమస్కారచ్చలమునఁ బ్రాణనాయకు నాపునర్భువు డాయంబోయి మ్రొక్కి కౌఁగిట దక్కి తనిసెను. కోమటిబిడ్డఁ డగు టిట్టిభునకుఁ గామమంజరీ మంచెనశర్మ లాతమ్మడిసానిఁ దగులుకొల్చిరి. జారజాయావతులు నిండుజందురునకు గొజ్జంగినీటనర్ఘ్యమును, పచ్చఁగప్పురమున నారతియు నొసఁగి మ్రొక్కి స్వస్తివేఁడిరి. కథ ముగిసెను.

కవితా విమర్శము

శ్రీనాథుఁడాంధ్రపద్యముల కబ్రపునిబ్బరపునడక నేర్పినాఁడు. శయ్యాసౌభాగ్య మాతనిరచనలలో సర్వత్ర యతిమాత్రమై సాగును. నన్నయ, నాచన సోమన తొలుత నిట్టిత్రోవద్రొక్కిరి. శ్రీనాథుఁడు దాని ఘంటాపథము

  1. శ్రీకాకుళ క్షేత్రమును గూర్చి నేను 'శ్రీకాకుళ శ్రీహరి' శతకపీఠికలో హెచ్చువిషయములు వ్రాసితిని. వాని నక్కడ చూడఁదగును.