పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

39


దేహిక్రియఁ దోఁచుఁ; బరమాత్మ దేహి గాఁడు.

21


వ.

అన విని రామచంద్రుం డఖలభూతంబులకు నాధ్యాత్మికంబును నాది
భౌతికంబు నను దేహద్వయంబు గలిగియుండు, నా బ్రహ్మంబున కెవ్వి
ధం బెఱిఁగింపవే యనుటయు నమ్మునికుంజరుం డిట్లనియె.

22


గీ.

భూతజాలంబు కారణోద్భూత మగుట
దేహయుగళంబుతోన వర్తించుచుండుఁ
గారణాత్ముఁడు గా కున్కిఁ గమలజన్ముఁ
డాధిదైవికదేహుఁడ యై వెలుంగు.

23


వ.

అట్లు గావున నద్దేవుండు సంకల్పపురుషుండును చిన్మాత్రస్వరూపుం
డును సకలజగదుత్పత్తిస్థితిలయకారణంబు నై విహరించుచుండు.
మఱియును.

24


గీ.

పొరి మనోరూపమును స్వయంభువును నగుచు
వెలయు నద్దేవుచే సృష్టి విస్తరిల్లు;
నట్లు గావున నీతోఁచు నఖిలజగము
దన్మనోమయ మని యాత్మఁ దలఁపు మనఘ.

25


వ.

అనిన విని రామచంద్రుం ‘డమ్మనోరూపం బెట్టిది? యమ్మనంబుచేత
నీదోషమంజరి యగుజగత్తు లెట్లు విస్తరెల్లె? నాన తిమ్మ’ ని యడి
గిన, నప్పరమసంయమి యిట్లనియె.

26


క.

విను మాత్మునిసంకల్పమె
మన మనఁబడుఁ గాక, వేఱ మన సొక్కటియే?
దనరఁగ సంకల్పము నెడ
మన మని వర్తించుచుండు మహితవివేకా.

27


వ.

అట్లు గావున మనస్సంకల్పంబులకు నెన్నఁడును దేనిచేతను భేదంబు
లే కుండు. మఱియు నవిద్యయు సంస్కృతియుఁ జిత్తంబు మనంబు
బంధంబు మలంబుఁ దమంబను నివి సంకల్పనామంబు లై యుండు;