పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

13


జావును మాన్పంగ నోపు సౌజన్యనిధీ.

62


వ.

అనిన విని భరద్వాజుం డక్కథాక్రమంబు వివరించి సెప్పు మనుటయు
వాల్మీకి యిట్లనియె.

63


సీ.

నారాయణునినాభినలినోదరంబునఁ
        బరమేష్టి, పొడమెఁ, దద్బ్రహ్మవలన
ఘనుఁడు మరీచి నాఁ గలిగె, నమ్మౌనికి
        గశ్యపుఁ డుదయించి కనియె సూర్యు,
నాసూర్యునకు మను వౌరసుఁ డై యుద్భ
        విల్లి యేలెను ధాత్రి, నల్లమనువు
పడసి నిక్ష్వాకునిఁ బరఁగఁ దత్పతివంశ
        కర్త యై రఘు వుర్విఁ గీర్తి కెక్కె,


గీ.

నతని కజుఁడు పుత్త్రుఁ డై నేల పాలించె,
నతనివలన నిందుమతి యనంగఁ
దనరుభాగ్యవతికి దానచింతామణి
ధర్మమూర్తి పుట్టె దశరథుండు.

64


వ.

అమ్మహాభాగుండు తనకు నయోధ్యానగరంబు నిజరాజధానిగా నఖల
సముద్రముద్రితధరావలయంబు నఱువదివేలేండ్లు పాలించి సంతతి
లేమికి నత్యంతచింతాక్రాంతుం డై పుత్త్రకామేష్టి సేయింప యజ్ఞ
పురుషుం డగువిష్ణునివరంబునం గోసలరాజపుత్త్రి యగు కౌసల్య
యనుపతివ్రతాతిలకంబునకు నొక్కపుణ్యదివసంబునందు –

65


ఉ.

శ్రీమహితాభిరాముఁడు విశిష్టజనస్తవనీయసద్గుణ
స్తోముఁడు భక్తలోకముఖతోయరుహాయతషండచండరు
గ్ధాముఁడు జూనకీనయనకైరవసోముఁడు ఘోరసంగరో
ద్ధాముఁడు కౌస్తుభాఖ్యమణిధాముఁడు రాముడు పుట్టెఁ బుత్త్రుఁడై.

66


వ.

తదనంతరంబ కేకయ రాజపుత్త్రి యగు కైకకు భరతుండును సుమి