పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లండన్లో తెలుగు వైభవ స్మృతులు

మండలి బుద్ధప్రసాద్

"లండన్లో తెలుగు వైభవస్మృతులు" గ్రంథరచయిత శ్రీ మండలి బుద్ధప్రసాద్ తెలుగు భాషా సంస్కృతులపట్ల అపారమైన గౌరవాభిమానాలు కలవారు. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖా మంత్రి హోదాలో ఇంగ్లాండులో పర్యటించిన శ్రీ బుద్దప్రసాద్ తెలుగుజాతికి ప్రాతఃస్మరణీయులైన సి.పి. బ్రౌన్, సర్ ఆర్థర్ కాటన్ సమాధులను సందర్శించి నివాళులర్పించారు. బ్రిటీష్ మ్యూజియంలో అమరావతి శిల్పాలు, లండన్ టవర్ మ్యూజియంలో కోహినూరు వజ్రాన్ని తిలకించి అవిశేషాలను తెలుగు ప్రజలకు ఈ గ్రంథం ద్వారా అందిస్తున్నారు. ఇంగ్లాండుకు వెళ్ళే తెలుగు వారికి ఈ గ్రంథం చక్కటి మార్గదర్శనం చేస్తుంది.