పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్టోబర్ 2న, జనవరి 30న మాత్రం ఈ రాట్నం వడికే పనిని టాలిస్టాకీ స్క్వేర్‌లో గాంధీ విగ్రహం వద్ద రోజంతా కొనసాగిస్తారు. విదేశాల్లో గాంధీ తత్త్వాన్ని ప్రచారం చేస్తున్న నిస్వార్థ సేవాతత్పరుడు గూటాల కృష్ణమూర్తిగారు.

గూటాల గురునాథస్వామి, సుభద్రమ్మ దంపతులకు కృష్ణమూర్తిగారు 1928వ సంవత్సరంలో పర్లాకిమిడి గ్రామంలో జన్మించారు. ప్రస్తుతమిది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. తండ్రి మేజిస్ట్రేట్‌గా పనిచేశారు.

వీరి విద్యాభ్యాసం విజయనగరంలోను, విశాఖపట్నంలోను సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి 1955లో ఎం.ఏ. ఇంగ్లీషు ఆనర్స్ పట్టా పుచ్చుకున్నారు.

1955-1958 మధ్య అమలాపురంలోను, 1958-62 మధ్య బిలాస్‌పూర్ లోను ఆంగ్లోపన్యాసకులుగా పనిచేశారు. నిరంతర చైతన్యవాహిని అయిన కృష్ణమూర్తిగారికి ఈ ఉద్యోగాలు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. పరిధులులేని ఆయన ప్రజ్ఞకు ఆకాశమే హద్దయింది.

1962లో రీసెర్చ్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళారు. 1966లో మధ్యప్రదేశ్‌లోని సాగర్ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్.డి. పొందారు. 1968లో అమెరికా వెళ్లి 1972 వరకు బ్రిడ్జ్ వాటర్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొవిడెన్స్ కాలేజిలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇది బోస్టన్ సమీపంలో ఉంది. 1972లో ఇంగ్లాండ్ తిరిగి వచ్చి లండన్ గ్రామర్ స్కూలులో విదేశీ విద్యార్థులకు ఇంగ్లీషు బోధించారు.

విదేశాలలో నిరంతరం విద్యావ్యాసంగంలో తలమునకలవుతూ కూడా, తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి కృష్ణమూర్తిగారు అహరహం శ్రమించారు. పది సంవత్సరాల పాటు లండన్‌లోని ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్‌కు అధ్యక్షులుగా పనిచేశారు. మా నాన్నగారు విద్యాసాంస్కృతికశాఖామంత్రిగా ఉన్నప్పుడు విద్యాసాంస్కృతిక రంగాల్లో ప్రవాసాంధ్రులకు చేయూతనివ్వడానికి స్థాపించిన అంతర్జాతీయ తెలుగు సంస్థతో సన్నిహిత

83