పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాజక్టులు, ఆనకట్టలు, వంతెనలు, చెరువులు, నీటిపారుదల కాలువలు నిర్మించడంలో భారతదేశంలోనే గడిపారు. “నీటిపారుదల కాటన్” గా ఈయన పేరు భారతదేశమంతటా ఈ రంగంలో సాధికారికతను సంతరించుకోవడమే కాక, ఈయన పథకాలన్నీ అత్యంత లాభదాయకమైనవిగా ప్రభుత్వంచే గుర్తింపు పొందాయి. నీటి పారుదల పథకాలపై ఆయనకు గల అత్యుత్సాహం మూలంగా రైల్వేల వంటి ఆధునిక వనరుల ప్రయోజనాన్ని గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు. భవిష్యత్తులో సంపద అభివృద్ధి అంతా నీటి కాలువల పైనే ఆధారపడి ఉంటుందని ఆయన దృఢంగా విశ్వసించారు. "మస్తిష్కంలో జలంతో బాధపడుతున్న ఏకలక్ష్య వ్యక్తిగా" ఆయనను కొందరు విమర్శకులు అభివర్ణించేవారు.

సర్ ఆర్థర్ కాటన్ తన విశ్రాంత జీవితాన్ని గడపడానికి డార్కింగ్ పట్టణానికి చేరుకుని, 1870 సంవత్సరాంతం వరకు తూర్పు హ్యారో రోడ్‌లోను, ఆ తరువాత టవర్ హిల్ రోడ్‌లోని ఉడ్ కాట్ (ఇక్కడ ప్రస్తుతం గార్డ్ నర్సింగ్ హోం నడుస్తున్నది) లోను ప్రశాంతమైన జీవితం గడిపారు. ఇక్కడ కూడ ఆయన వ్యవసాయరంగంలో మెరుగైన పద్ధతులు ప్రవేశపెట్టడానికి, ముఖ్యంగా లోతుగా నేలను దున్ని చేసే సేద్యం గురించి ఎంతో కృషి చేశారు. అయితే, భూమిని దున్నడానికి ఆయన ప్రత్యేకంగా రూపొందించిన పొడవైన పళ్ళను పోలిన పరికరాల పట్ల స్థానిక కార్మికులలో ఏర్పడ్డ అపోహల మూలంగా ఈ ప్రయత్నం విజయవంతం కాలేక పోయింది. రిక్షా వంటి మూడు చక్రాల వాహనంలో తిరుగుతూ, ఆయన చేసిన ధార్మిక ప్రచారాల మూలంగాను, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల మూలంగాను పట్టణంలో అందరికీ ఆయన సుపరిచితుడైనారు. తన అవిశ్రాంత కృషే. తన ధీర్గాయువు యొక్క రహస్యమని ఆయన అనేవారు.

డార్కింగ్ పట్టణంలోని శ్రామికులను వారి పని వేళల్లో బీరు త్రాగే అలవాటు నుంచి మాన్పడానికి ఆర్థర్ కాటన్ వంటింట్లో తయారు చేసుకోవడానికి వీలైన ఒక రకం సూపును రూపొందించి ప్రచారం చేశారు.

71