Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్పాలస్త్యుబర్ణశాలకు
లీలావతి చనియె హంసలీలాగతులన్.

114


క.

చని మునిచెంగట లజ్జా
వనతాననకమల యగుచు వనితామణి యొ
య్యనఁ జరణాంగుష్ఠాగ్రం
బున నవని లిఖించుచుండె ముద మెద గదురన్.

115


క.

ఆసమయంబున నంబురు
హాసనకులదీపకుఁడు హుతాశననిభతే
జోసహ్యుఁ డగ్నిహోత్ర ము
పాసించెన్ విశ్రవుం డుదంచితనిష్ఠన్.

116


వ.

అనంతరంబ.

117


మ.

కనియెం జెంగట విశ్రవుం డపుడు రాకాచంద్రబించాననన్
ఘనవేణిం బికవాణిఁ గుందరదన న్నవ్యప్రవాళాధరం
దనుమధ్య న్మదకుంభికుంభపృథులోద్యద్బాహుకూలంకష
స్తనభారానమితాంగి హంసగమనన్ దైతేయకన్యామణిన్.

118


క.

కని సొగసులగని యగున
ద్దనుజేంద్రకుమారిచక్కదనమున కెంతే
మనమున నచ్చెరువడి యా
ముని మొగమున నలతినగవు మొలువం బలికెన్.

119


క.

లలనా తెలియం బలుకుము
పొలయలుక వహించి వల్లభున్ మొరగి వన
స్థలిలోన డాగ వచ్చిన
వలరాయనిసతివొ కాక వనదేవతవో.

120


గీ.

తరుణి యెవ్వానిముద్దుకూఁతురవు నీవు
వచ్చి తెచ్చటినుండి నీ విచ్చటికిని
యేమి కార్యంబుఁ దలఁచి నీ విందు నిలచి
తెఱుఁగఁ బల్కుము నిజముగా నిందువదన.

121