Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

61

సిద్ధాంతము కల్పితమయ్యెను. ఇంకను ఏవేవి దశావతారాలో స్పష్టపడ లేదు. అందుచేత వివిధ పురాణాలలో వివిధ పద్ధతులపై వ్రాయుచు వచ్చిరి.


“మత్స్యః కూర్మో వరాహశ్చ నృసింహో వామనస్తథా
 భార్గవో రాఘవః కృష్ణః బుద్ధః కలికిరేవచ .”


ఈ శ్లోకము మహాభారతము 12-348-2 అనుచోట ఉన్నదని జ. మో. చటర్జీగారు పృశ్నిగాథా పీఠికలో వ్రాసిరి. ఆది యందు కాన రాలేదు. పైగా ఈ క్రింది శ్లోకము మాత్రము మహాభారతమందు కనబడు చున్నది:


హంసః కూర్మశ్చ మత్స్యశ్చ ప్రాదుర్భావా ద్ద్విజోత్తమ
వారాహో నరసింహశ్చ వామనో రామ ఏవచ
రామో దాశరథిశ్చైవ సాత్వతః కల్కి రేవచ .”
                               మహాభారతం - శాంతి. 339 - 100


ఇందు బుద్దునిపేరు లేదు. రాబోవు కల్కి పేరున్నది. సాత్వతు డనగా బలరాముడా కృష్ణుడా అను సంశయానికి తావులేకుండా పైభాగ మందు శిశుపాల కంసాదులవధ చేయుదునన్నందున కృష్ణుడే యని స్పష్టమగుచున్నది. ఈ యవతార పట్టిక లో హంసావతార మెక్కుడుగా నున్నది. వామనపూజలో ఈ క్రింది శ్లోకము కనబడుచున్నది:


మత్స్యం కూర్మంచ వారాహం నారసింహంచ వామనం
రామం రామం రామకృష్ణం బౌద్ధం కల్కిం నమామ్యహమ్.


ఇచ్చట ముగ్గురు రాములు- పరశురాముడు, రఘురాముడు, బలరాముడు చేరినారు. కృష్ణుడును చేరినాడు. ఈ విధముగా అవతారాల నిర్ణయము ఇంకను ఏకరూపము దాల్చియుండ లేదు.