పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 27

నతనియెద నిండి తగునా దయారసంబు
పైని దానిట్టులను గానవచ్చె ననఁగ. 96

క. తొగమగనిబావ నిట్టుల
వగగాఁ గైసేసి తెచ్చి పనిహర్వులహో
న్మగరాలచవికెలోపలఁ
దగుపచ్చలపీట నునిచి తరుణులు వేడ్కన్. 97

తే. చని యిళాదేవిఁ గని లగ్న సమయమాయె
రమ్ము మాయమ్మ యని క్రమ్మి కొమ్మ లెల్ల
బలిమిఁ గొని పిల్వ రాధికభయముచేతఁ
దగ్గి దిగ్గున లేచి నున్ సిగ్గు మాని. 98

చ. వలపులచంద్రకావిజిగి, పావడరంగు లెసంగఁ బైఠిణీ
జిలిబిలి చీరకుచ్చెళులు చిందులు ద్రొక్కఁగ జంటిరైకలో
వలిచనుగుబ్బ లుబ్బఁగను బంగరుటందెలు ఘల్లుఘల్లనన్
జలజదళాక్షి వచ్చె రభసంబున నయ్యదురాజునొద్దకున్. 99

తే. అపుడు సుముహూర్త మనుచు గర్గాదిమునులు
శోభనముఁ జేసి రానిత్యశోభనులకు
వాద్యములు మ్రోయ నిఖలదిక్పతులు పొగడ
నాప్తబంధుసుహృత్కోటి తృప్తిఁ బొంద. 100

క. అవ్వేళను హరియు నిళా
యౌవ్వతరత్నంబు బాంధవావలితోడన్
బువ్వము దిని రారుచులకు
నువ్వి ళ్ళూరుచును మెప్పు లొసఁగుచు నంతన్. 101

క. నందుం డందఱఁ బరమా
నందంబును నొందఁ జేసె నయ్యైమర్యా
దం దగుసూనృతభాషా
సందోహముచేఁ బటాదిసత్కారములన్. 102