మండలములో నున్నదని కవిచరిత్ర మందుఁ జెప్పఁబడియుండెడు. ఈకవితండ్రి యగునమరనార్యుఁడు రాజేంద్రగురువంశమునం బుట్టిన సోమారాధ్యునకు శిష్యుఁ డైనశైవాచారపరుఁడని ప్రభావతీప్రద్యుమ్నములోని
| క. | "శ్రీమద్రాజేంద్రగురు, స్వామిస్థిరవంశకలశజలనిధిసోమ | |
అనుపద్యమువలన నేర్పడియెడు.
ఈకవి జీవించియుండినకాలముం గూర్చి శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులుగారు కవిచరిత్రమందు సయుక్తికంబుగఁ జర్చించి క్రీస్తుశకము 1566 సంవత్సరముల ప్రాంతమున నుండినవాఁడని నిర్ధారణము చేసిరి. శ్రీకృష్ణదేవరాయలు 1530-వ సంవత్సరముననే కీర్తిశేషుఁ డగుటచే నీకవి తదాస్థానమం దష్టదిగ్గజము లని పరిగణింపఁబడినవారిలో నొక్కఁ డని తలఁప నవకాశము లేదనియుఁ గవిచరిత్రమునందే సిద్ధాంతము చేయఁబడి యుండెడు. దీనికి వలసినయంశములనెల్ల సాకల్యముగఁ జర్చింపకయే యీతఁడు శ్రీకృష్ణరాయలకాలమువాఁడు గాఁడని సామాన్యముగను నూహింపవచ్చును. పింగలి సూరనార్యుని కవితాచమత్కృతి యత్యంతాదరణీయ మని వేనోళ్లఁ బొగడఁదగియుండుటయు, సుకవులయెడ శ్రీకృష్ణదేవరాయల కత్యంతాదరము కలిమియు విద్వాంసుల కెల్లఁ దెల్లంబ కదా. శ్రీకృష్ణదేవరాయలకాలమునం దీకవి వాస్తవముగ నుండియుండునేని యాకువీటి పెదవేంకటరాయలకును నంద్యాలకృష్ణరాయలకును దనకావ్యముల నంకితము చేసినయీకవి తాను గవియై కవితాదరణబద్ధదీక్షుం డైన శ్రీకృష్ణదేవరాయల నాశ్రయింపక యుపేక్షించుట యీకవికిని, సరసనిరుపమకవనకౌశలమున కలరుచు నిమ్మహాకవిని నిజాస్థానంబునఁ జేర్చుకొన కొప్పరికించుట యా విద్వత్ప్రభుమణికిం బొసఁగునే? కావున నారాజాధిరాజకవియు నీకవిరాజాధిరాజును సమకాలికులుగా నుండియుండ రని నిరాక్షేపముగ నిశ్చయింపఁ దగియుండెడు.
ఈకవిశ్రేష్ఠుండు చిన్నచిన్నకృతు లెన్నియోగాక గరుడపురాణము, రాఘవపాండవీయము, కళాపూర్ణోదయ మనుగ్రంథముల రచియించి