పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1930-1940 సంవత్సరాల మధ్య కాలంలో 70 శాతం చిల్లర వ్యాపారం ఆంధ్రుల చేతిలో ఉంది.

పెట్టెల తయారీ పరిశ్రమ, ఇంటిసామాగ్రి తయారీ పరిశ్రమ, మట్టికుండల తయారీ పరిశ్రమ కూడా ఆంధ్రులు స్థాపించారు. పెరుమాళునాయ్డు, బంగారుచెట్టి నగల తయారీ పరిశ్రమలో ప్రముఖులు.

ఆంధ్రులు 1960 దశకంలో బట్టల, తోళ్ళ, వ్యాపార, ముద్రణ పరిశ్రమల్లోకి చొరబడ్డారు.

భారతీయ విధ్యాబోధనలో ఆంధ్రులు విశిష్టమైన పాత్ర నిర్వహించారు. భారతీయ పాఠశాలల్లో చాలామంది ఆంధ్రా అధ్యాపకులు ఉన్నారు. విద్యాశాఖలో కూడా చాలా మంది ఆంధ్రులు ఉన్నారు. ఆర్ధికశాస్త్రంలో ప్రధమంగా పట్టభద్రుడైన మొదటి ఆంద్రుడు వి.సర్కారినాయ్డు, మొట్టమొదటి మహిళా డాక్టర్ డా॥ కె.గునమ్. ఆర్.ఎస్.నాయ్డు దక్షిణాఫ్రికా ఉపాధ్యాయ సంఘం మొదటి అధ్యక్షుడు.

1990 లో డర్బన్ వెస్ట్‌విల్ విశ్వ విద్యాలయంలో మొదటి భారతీయ లెక్చరరు ఆంధ్రుడయిన ఆచార్య జయరామరెడ్డి, డర్బన్ నగరంలో డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్‌గా డా॥ అనుషానాయుడు ఉన్నారు. న్యాయవాద వృత్తిలో జి.నాయ్డు ప్రముఖుడు.

ఇక రాజకీయ రంగంలో పి.కె.నాయుడు గాంధీజీకి కుడిభుజంగా పరిగణించబడేవాడు. హెచ్.వి.నాయ్డు ట్రేడ్ యూనియన్ నాయకుడు. ఆంధ్రులు నేటాల్ ఇండియన్ కాంగ్రెస్‌లోనూ, ప్రతిఘటనా ఉధ్యమంలోనూ ప్రముఖపాత్ర వహించారు. 'కొసాటు' కార్యదర్శి శ్రీ జి.నాయ్డు.

హోటలు, మద్యపానీయ పరిశ్రమలు బహిరంగ విధానం అమలు చేసినప్పుడు ఆంధ్రులు వెంటనే ఈ రంగాలలో చొరబడి ప్రాబల్యం సంపాదించారు. రవాణా రంగంలో, భవననిర్మాణంలో కూడా ఆంధ్రులు ప్రాబల్యం సంపాదించారు. ప్రజాజీవనంలోనూ, సాంఘిక సేవారంగంలో కూడా ఆంధ్రులు ఏమాత్రం వెనుకబడిలేరు. దక్షిణాఫ్రికా సమాజంలో ఆంధ్రులు చాలా తక్కువ భాగం అనటానికి సందేహం లేదు. త్రొక్కివేత నిబంధనలను అధిగమించి ఇతర భాషల్లో మాట్లాడే సమూహాలతో పాటువారూ సమాజంలో పైకి వెళ్ళడం వారికార్యదీక్షకు, పట్టుదలకు ప్రతీకలు. కార్యసిద్ధికై తపన, త్యాగనిరతి వారిజీవనవిధానంలో ప్రస్పుటంగా కనిపిస్తాయి.