పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 మారిషస్ గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు, శ్రీమతిఏదే.వి.నృశింహులు ఆనందన్ వ్రాసిన 'ది ప్రిమోర్డియల్ లింక్ తెలుగు ఎధినిక్ ఐడెంటిటి ఇన్ మారిషస్' అనే సిద్ధాంత గ్రంధాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ప్రచురించిన ఈ గ్రంధం మారిషస్ తెలుగు వారిపై చక్కని అధ్యయనం.

సర్ వీరాస్వామి రింగడు ప్రసంగిస్తూ మారిషస్ సమాజంలోని ప్రతి వర్గానికి తమ సాంస్కృతిక వారసత్వం కాపాడుకోటానికి, తమ భాషాభివృద్ధి చేసుకోటానికి అవకాశాలు కలిగించాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సంస్కృతిని గురించి మరుగుపడి ఉన్న కొన్ని విషయాలు వెలుగులోకి తీసుకు రావటానికి సభలు దోహదపడగలవనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు మారిషస్ జీవన విధానంపై తగిన అవగాహన కలగటానికి ఈ సభలు ఉపకరిస్తాయని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్కృతీ వ్యవహారాల డైరెక్టర్ శ్రీ సి.వి.నరిశింహారెడ్డి రాష్ట్ర గవర్నర్ శ్రీ కృష్ణకాంత్, ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పంపిన సందేశాలను చదివి వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి వర్గ నాయకుడు, తెలుగు విశ్వవిధ్యాలయ వైస్ ఛాన్సలర్ డా॥ సి.నారాయణరెడ్డి కీలకోపన్యాసంలో తెలుగు భాషా విశిష్టతను సోదాహరణగా వివరించారు. తన సహజ సిద్ధమైన ప్రసంగ శైలిలో మధ్య మధ్య తెలుగు పద్యాలు ఉటంకిసూ అంత్యప్రాసల నొక్కులతో వినిపించి సభికులను అలరించారు. 'త్యాగరాజ కీర్తన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు' రాగయుక్తంగా డాక్టర్ నారాయణ రెడ్డి ఆలపించారు. సభాప్రాంగణం కరతాళధ్వనులతో మారుమ్రోగింది. 'ఇంతింతై వటుడింతై...బ్రహ్మాండాంత సంవర్ధియై' అన్నట్లు మనకళ్ళెదుటే త్రివిక్రరూపం దాల్చిన డాక్టర్ నారాయణరెడ్డి జీవితంలో మారిషస్ సభలు మరో మధుర ఘట్టం.

దక్షిణాఫ్రికా ప్రతినిధి వర్గపు నాయకుడు శ్రీ నాయ్డు 'దండమయూ విశ్వంబర...' అనే పద్యంతో తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలుగు భాష పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు ఆయన ప్రసంగంలో ప్రస్పుటించాయి. తెలుగు మహాసభల నిర్వహణకు సహాయంగా 5000/- ల విరాళం శ్రీ నాయుడు అందచేశారు.

మలేషియూ తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీపాల్ నాయ్డు కూడా ప్రసంగించారు.