పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 1935లో ఇంగ్లాండు నుండి మారిషస్ చేరుకుని స్వాతంత్ర్య సముపార్జనకు నడుం కట్టారు. బానిసలుగానూ, కూలీలుగానూ ఫ్రెంచి వారి చేతుల్లోనూ, ఇంగ్లీషు వారి చేతుల్లోనూ నలిగి పోతున్న భారతీయులలో స్వతంత్రేచ్చ రగిలించారు.

1942లో భారతదేశంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో ప్రారంభం అయిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని రామ్ గులామ్ బహిరంగంగా సమర్ధించారు. 1948లో జరిగిన మారిషస్ పార్లమెంట్ ఎన్నికల్లో రామ్ గులామ్ నాయకత్వాన్న లేబర్ పార్టీ విజయం సాదించింది.

1967 ఆగష్టు 7వ తేదీన జరిగిన ప్రతిష్టాకరమైన ఎన్నికల్లో మారిషస్ ప్రజలు స్వాతంత్ర్య కాంక్షకు విజయం చేకూర్చారు. తత్ఫలితంగా 1968 మార్చి 12న మారిషస్ స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

సర్ శివ సాగర్ రామ్ గులామ్ స్వాతంత్ర మారిషస్‌కు తొలి ప్రథాని అయ్యారు. ఆ తరువాత గవర్నర్ జనరల్‌గా కూడా పనిచేసి స్వర్గస్థులైనారు.

1967 ఆగష్టు లో మారిషస్ లో జరిగిన విశ్వ హిందీ సమ్మేళనంలో మా నాన్నగారు భారతదేశ ప్రతినిధివర్గ సభ్యునిగా పాల్గొనటం జరిగింది. అప్పుడు సర్ శివసాగర్ రామ్ గులామ్ మారిషస్ ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో వారిని కలిసే అవకాశం నాన్నగారికి దక్కింది. మహాత్మాగాంధీ సంస్థలో ఇతర భాషలతో పాటు తెలుగుకి కూడా అవకాశం కలిగించాలని నాన్నగారు చేసిన అభ్యర్ధనని వారు వెంటనే అంగీకరించారు.

తెలుగుజాతికి మారిషస్ అపూర్వ స్వాగతం

మా విమానం రన్‌వే మీద పరుగులు తీసి విమానాశ్రయంలో ఆగింది. మారిషన్ భూభాగంపై కాలుమోపాము. మారిషస్ ఇంధనశాఖా మంత్రి శ్రీ మహేన్ ఉచ్చన్న, మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ పూసరాజ్ సూరయ్య పలువురు అధికార, అనధికార ప్రముఖులు మాకు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాత్రికేయుడు శ్రీ గోవాడ సత్యారావు కూడా ఉన్నారు. శ్రీ సత్యారావు కొద్దిరోజులు ముందే మారిషస్ చేరుకుని తెలుగు మహాసభల ఏర్పాట్లను గురించి మన రాష్ట్రంలో పత్రికలకు ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్నారు.

మేము చెకింగ్ పూర్తి చేసుకుని విమానాశ్రయం లాంజ్ లోనికి అడుగిడగానే ఒకే రకం చీరలు ధరించి మోమున చిరునవ్వులు చిందిస్తూ మారిషన్ లోని తెలుగు