పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారధి అవుతుంది. తెలుగుభాషాపరంగా చూస్తే దానికి మహోన్నతమైన చరిత్ర వుంది.

ప్రాచీనమైన సాహిత్యం వుంది.

క్రీ.శ. 6వ శతాబ్దం నాటినుండి తెలుగులో శాసనాలు, 11వ శతాబ్దం నుండి సాహిత్య రచనలు లభ్యమవుతున్నాయి. రెండువేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల తెలుగుభాషకు 'ఆంధ్రము, తెనుగు, తెలుగు అను మూడు పేర్లు వ్యవహారనామములుగా వర్ధిల్లుతున్నాయి.

11వ శతాబ్దం మధ్యలో చాళుక్యరాజైన రాజరాజనరేంద్రుని ఆస్థానంలో వున్న నన్నయ్య భట్టారకుడు రచించిన భారత భాగమే తెలుగున సలక్షణమైన ప్రధమాంధ్ర కావ్యము.

"శ్రీవాణి గిరిజా" అని మంగళప్రదముగ భారత రచనకు శ్రీకారం చుట్టి తెలుగుకు మొట్టమొదట కావ్యత్వ గౌరవాన్ని సంతరించిపెట్టి నన్నయ్య "ఆదికవి" అయినాడు. నన్నయ్య చూపిన కావ్యరచనా మార్గమే ఆ తర్వాత వారగు నన్నేచోడ, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాధ, పోతన, పెద్దనాది కవులకు మార్గదర్శకం అయినది. నాటినుంచి తెలుగు భాష బహుశక్తివంతమై సాహిత్యాన్ని పుష్టివంతం చేయసాగింది.

త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసులు తమ పద కీర్తనలలో తెలుగుకు క్రొంగొత్త వెలుగులు తెచ్చారు. వారి కీర్తనలలో సంగీత, సాహిత్యాలు సమపాళ్ళలో మేళవించబడి తాళయుక్తముగా తరుముకుంటూ నడిచి 'తెలుగు తీపి'ని పరభాషల వారికి రుచి చూపించాయి.

అందుకే శ్రీ రాయప్రోలువారు -

తన గీతి యరవ జాతిని పాటకులనుగా

దిద్ది వర్తిల్లిన తెనుగు వాణి'

అంటూ ప్రస్తుతించారు. తెలుగుభాషలోని మాధుర్యమూ, సారళ్యమూ అనే గుణాలు సంగీతానికి ఉపకరించి గానానికి అనుకూలించాయి.


నన్నయ్యనుంచి నారాయణరెడ్డి వరకు తెలుగు సాహిత్యం కాలానుగుణంగా పరిణితి చెందుతూ వచ్చింది. సుమధుర వాహినిగా. . పలురకాల ప్రక్రియల రూపానా తెలుగుభాష బహురూపాలను సంతరించుకుంది.

కన్నడ రాయడు, తెలుగు వల్లభుడు, శ్రీకృష్ణదేవరాయలు "దేశ భాషలందు తెలుగులెస్స" అని కీర్తించిన అపురూపమైన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు తెలుగు భాషని "ఇటలీయన్ ఆఫ్ ది ఈస్టు" అని ఘనంగా కీర్తించారు.