Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

చటులోద్వృత్తిసటావిపాటివిరాజత్సాంద్రజీమూత మై
పటుకోటీనఖపాటితేభగణకుంభగ్రస్తముక్తాఫలో
ద్భటలోలచ్చరణాగ్ర మై విపులనాదత్రాసితాశాగజో
త్కట మై సింహచయంబు హస్తిసమితిం గారించె నిస్సీమతన్.

2046


వ.

అంత.

2047


తే.

విలయనిష్క్రాంతపావకవిపుల మగుచు, మిగిలి యెగసినమంటలు మిన్ను రాయ
నుల్లమున దేవనివహంబు తల్లడిల్ల, ననియె దైత్యుండు శితశూల మడరి తాల్చి.

2048


మ.

ఘనకోదండమునేర్పు మీఱ విశిఖగ్రామంబు సత్కౌశలం
బును నీ వేర్చడఁ జూపు మింక ననిలో భూరిప్రతాపంబు నే
వును గర్వంబును దూలిపోవ నిపు డీపొల్పొందుశూలంబు ని
న్నును నీసోదరుఁ గూల్చు నిక్కువము నన్నున్ గెల్వ నీశక్యమే.

2049


వ.

అని మిన్నంది మహాగ్రహవ్యగ్రాయమానుం డై.

2050


ఉ.

పూని యదల్చి వైచె నది భూరిజవంబున నుగ్రపావకా
నూనశిఖావలీజటిలితోద్ధత మై లయకాలరుద్రసం
ధానసమావహం బగుచుఁ దద్దయుఁ బేర్చినశూల మంత న
ద్దానవవంశవర్ధనునుదగ్రతఁ జూపుచు వచ్చెఁ బెల్చనన్.

2051


క.

నరవరుఁడు దానిపై శిత, శరములు గురియింప వాని సరకుగొనక యు
ద్ధురమున నొక్కటఁ గూల్చుచు, నురవడిఁ జనుదేరఁ జూచి యుద్ధతి మఱియున్.

2052


ఉ.

అంచిత మైనకూర్మి నమరాధిపుఁ డెంతయు వేడ్కతోడఁ బు
త్తెంచిన శక్తిఁ బుచ్చుకొని ధీరత వైచిన భానుమండలో
దంచిత మై నిశాటభయదం బయి దేవముదావహంబు నై
త్రుంచి దశాస్యుశూలమును దుర్దమ మై యది వచ్చి వ్రేల్మిడిన్.

2053


వ.

దశకంఠుండును వితథీభూతదివ్యసాధనుం డై సటానముత్పాటనకుసితం బగుకంఠీ
రవంబుచాడ్పునఁ గరాళక్ష్వేళాపూరితదిక్కుహరుం డై విస్ఫారంబు సెలంగఁ
బ్రళయాభ్రంబపోలె నశనికోటిదారుణంబు లైననిశితశరంబులు గురిసి దశ
విశిఖంబుల రాఘవు నన్నియశరంబుల మాతలిని వివశత నొందించి యొక్కనిశి
తభల్లంబున మణికాంచనమండితంబును నభ్రంలిహాగ్రంబును నప్రతివిహారంబును
సమీరణలోలపటవిరాజమానంబును నగుకేతుదండంబు గపులు నిలింపులు
నులుక నమరవైరు లలర నవనిం బడవయిచి.

2054


చ.

మఱియును దైత్యుఁ డానృపకుమారుని నుగ్రశిలీముఖంబులన్
నెఱఁకులు దూఱనేసి ధరణీస్థలి గ్రక్కదలంగఁ దేరిపైఁ
బఱపి యురోలలాటతటబాహులు నాటఁగఁ గీలుకొల్పి త
త్తఱపడఁజేసె దేవసముదాయము నెల్ల నుదగ్రవృత్తి యై.

2055